అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జో బిడెన్ గురించి చెప్పినప్పుడల్లా అక్కడి మీడియా ఓ వ్యక్తిని బాగా హైలెట్ చేస్తోంది.బిడెన్ ప్రధాన సలహాదారుల్లో ఒకరిగా ఆయన వెనుక నుంచి నడిపిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి బిడెన్ అన్ని దశలను విజయవంతంగా దాటుకుని వస్తున్నారంటే అందులో ఆ వ్యక్తిది కూడా కీలకపాత్రే.ఆయన ఎవరో కాదు.
మన భారతీయుడే.పేరు వివేక్ మూర్తి (43).
ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి.బిడెన్ కనుక అధ్యక్షడైతే ఖచ్చితంగా కీలక పదవి దక్కే మొదటి పేరు మూర్తిదే. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా హళెగెరె గ్రామానికి చెందిన వివేక్ మూర్తి కుటుంబానికి తొలి నుంచి రాజకీయాలతో అనుబంధం వుంది.ఆయన తాత హెచ్టీ నారాయణ శెట్టి ఆ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత.అంతేకాకుండా కర్ణాటక మాజీ సీఎం దివంగత దేవరాజ్ ఉరుసుకు అత్యంత సన్నిహితుడు.డాక్టర్ వివేక్ మూర్తి తండ్రి డాక్టర్ హెచ్ఎన్ లక్ష్మీ నరసింహ మూర్తి.
మైసూర్ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు.ఆయన యూకేలో పలు హోదాల్లో పనిచేశారు.
వివేక్ సోదరి రష్మి కూడా అమెరికాలోని ఫ్లోరిడాలో ఫిజీషియన్గా సేవలు అందిస్తున్నారు.బ్రిటన్లో జన్మించిన వివేక్ మూర్తి అమెరికాలో పెరిగారు.
హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.అనంతరం యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఎండీ చేశారు.
ఆయనకు సొంతంగా క్లినిక్ కూడా వుంది.వాషింగ్టన్లోని డాక్టర్ ఆఫ్ అమెరికాకు వివేక్ సహ వ్యవస్థాపకుడు కూడా.ఈ సంస్థ అతి తక్కువ ధరకే క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసులు అందిస్తుంది.సుమారు 16,000 మంది ఫీజిషియన్లు, మెడికల్ స్టూడెంట్లు, మెడికల్ సలహాదారులు ఇందులో సేవలు అందిస్తారు.ఒబామాకు అత్యంత సన్నిహితుడైన వివేక్ మూర్తి ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.2008, 2012 ఎన్నికల ప్రచారంలో డాక్టర్స్ ఆఫ్ అమెరికా పాల్గొంది.అందుకే ఈ సంస్థను డాక్టర్స్ ఫర్ ఒబామా అని పిలుస్తారు.
ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011లో వివేక్ మూర్తిని ప్రజారోగ్యంపై సలహాదారుగా నియమించారు.
అమెరికాకు చెందిన గన్ లాబీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ 37 ఏళ్ల చిన్న వయసులోనే వివేక్ మూర్తిని తన సర్జన్ జనరల్గా అపాయింట్ చేశారు ఒబామా.అమెరికన్ సెనేట్లో దీనిపై ఓటింగ్ జరగ్గా.
అనంతరం సెనేట్ వివేక్ నియామకాన్ని ఆమోదించింది.అమెరికాకు సంబంధించి ప్రజారోగ్య సమస్యలపై అత్యున్నత స్థాయి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
ఇదే సమయంలో ఇటు డెమొక్రాట్లు, అటు రిపబ్లికన్లు సైతం మూర్తి సమర్ధతపై అనుమానాలు వ్యక్తం చేశారు.అయితే ఒబామా హెల్త్ కేర్ తీసుకురావడంతో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఎంత ఎదిగినా, వివేక్ మూర్తి తన మూలాలను, మాతృభాషను వదిలిపెట్టలేదు.ఇంటి వద్ద కచ్చితంగా కన్నడంలోనే మాట్లాడతారు.ప్రతి సంవత్సరం తాను పుట్టిన ఊరికి వస్తారు.అక్కడ విద్యను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు.
తమ కుటుంబం ఏర్పాటు చేసిన స్కోప్ ఫౌండేషన్ తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు.గతంలో నిర్వహించిన కంటి పరీక్ష క్యాంప్లో 60 మందికి ఆపరేషన్లు కూడా చేయించారు.
అలాగే, మద్దూర్ తాలూకాలోని ప్రభుత్వ స్కూలుకు 100 కంప్యూటర్లను కూడా బహూకరించారు.మాండ్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకేసారి కంప్యూటర్లను అందివ్వాలని వివేక్ మూర్తి కుటుంబం భావించినా, ఆయా స్కూళ్లలో కరెంటు, నిర్వహణ సమస్యల వల్ల విడతల వారీగా అందించాలని నిర్ణయించారు.
దీంతో పాటు కంప్యూటర్ల కోసం సోలార్ కిట్లు కూడా అందిస్తోంది స్కోప్ ఫౌండేషన్.ఉచిత హెల్త్ కవర్ను ఎలా అమలు చేయవచ్చనే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా వివేక్ మూర్తి ముందుకొచ్చారు.