2000వ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మన దేశం 20 ఏళ్లలో సూపర్ పవర్ అవుతుందని మన మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు అంచనా వేశారు.వారి అంచనాలు తప్పుకాలేదు.
భారతదేశంలో వున్న సహజ వనరులు, అత్యున్నత ప్రమాణాలున్న మానవ వనరులు, యువత, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రగతి వంటి అంశాల ద్వారా భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది.ఇక కరోనా సంక్షోభ సమయంలో ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది.
తొలుత పీపీఈ కిట్లు, టెస్టింగ్ సామాగ్రి, ఇతర వైద్య పరికరాల కోసం మనదేశం దిగుమతులపై ఆధారపడింది.కానీ అతి తక్కువ కాలంలోనే దేశీయంగా వీటిని ఉత్పత్తి ప్రారంభించి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది.
ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల కోసం అమెరికా సహా అగ్రరాజ్యాలు మనదేశం ముందు క్యూకట్టాయి.కరోనాను కట్టడి చేయడంతో పాటు అత్యంత వేగంగా ఆర్ధిక వ్యవస్ధను భారత్ గాడిలో పెట్టింది.
దీనికి సమాంతరంగా వ్యాక్సినేషన్ను సైతం ప్రారంభించి ఔరా అనిపించుకుంది.ఈ నేపథ్యంలో మనదేశం సత్తాను అన్ని దేశాలు ప్రశంసిస్తున్నాయి.
మరోవైపు ఇండియా అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమకు భారత్ కీలక భాగస్వామి అని అమెరికా తెలిపింది.
ప్రాంతీయంగా శాంతి భద్రతలను నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించింది.ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెగ్ ప్రైస్ ప్రకటన చేశారు.
మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రైస్ తెలిపారు.ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు శాంతియుత పరిష్కారానికి దారితీయాలని ఆకాంక్షించారు.పొరుగుదేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు.అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో ఫోన్లో మాట్లాడారు.ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేశారు.అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం, కొవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులపైనా చర్చించారు.
అమెరికాకు భారత్ ప్రధాన వాణిజ్య భాగస్వామి అని ప్రైస్ తెలిపారు.భారత్లో ఎఫ్డీఐలకు అమెరికా కంపెనీలు కేంద్రంగా ఉన్నాయని ఆయన అన్నారు.