అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను పున: సమీక్షిస్తూ వస్తున్న జో బైడెన్ ఇమ్మిగ్రేషన్, వీసా విధానంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసా జారీని పాత లాటరీ విధానంలోనే నిర్వహించనున్నారు.ఈ మేరకు హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్ తీసుకొచ్చిన నూతన నిబంధనలను డిసెంబర్ 31 వరకు వాయిదా వేస్తూ బైడెన్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
హెచ్-1బీ వీసాల జారీలో దశాబ్ధాలుగా అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు.దీనికి అనుగుణంగా హెచ్-1 బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐసీ) జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది.
దీని ప్రకారం మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది.
అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున కాస్త సమయం పట్టే అవకాశం వుంది.అందువల్ల నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది.అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
కాగా, ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.
కొత్త విధానం ప్రకారం.హెచ్ 1 బీ వీసాల్లో మార్పులు వస్తే భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా నిబంధనల ప్రకారం.సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా వర్గీకరిచి డీఓఎల్ నియంత్రిస్తుంది.తాజా మార్పుల ప్రకారం.
ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది.అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్ 1 బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను చెల్లించాల్సి వుంటుంది.
ఇక విద్యార్ధుల విషయానికి వస్తే.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని వివిధ యూనివర్సిటీల్లో సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.హెచ్ 1 బీ వీసా విధానంలో తాజా మార్పుల వల్ల అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది.దీని వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు నష్టపోనున్నారు.