జో బైడెన్ ఘన విజయం.డొనాల్డ్ ట్రంప్ మంకుపట్టు, క్యాపిటల్ హిల్ భవనంపై దాడి వంటి ఘటనలు ఇంకా ప్రపంచం కళ్ల ముందే ఉన్న సంగతి తెలిసిందే.
కానీ అప్పుడే అమెరికన్ మీడియా 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.ఇంకా నాలుగేళ్ల సమయం వున్నప్పటికీ స్థానిక మీడియా దీని గురించి కథనాలు వెలువరించడం మొదలుపెట్టింది.
ఈసారి ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్నే ‘‘ మీరు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా’’ అంటూ అడిగింది.దీనికి అగ్రరాజ్యాధినేత సైతం చిరు నవ్వుతో సమాధానం చెప్పారు.
వివరాల్లోకి వెళితే… బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ భేటీకి కేవలం 30 మంది జర్నలిస్టులను మాత్రమే అనుమతించింది వైట్ హౌస్.
ఈ సందర్భంగా బైడెన్ను జర్నలిస్టులు పలు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయాలు, కరోనా తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు.ఈ క్రమంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ‘అవునని’ సమాధానం చెప్పారు బైడెన్.
అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడమే తన ప్రణాళిక అని అన్న ఆయన తనతో పాటు ఉపాధ్యక్షురాలిగా మళ్లీ కమలా హ్యారిసే పోటీ చేస్తారని సంకేతాలిచ్చారు.ఇదే సమయంలో ట్రంప్తో మరోసారి తలపడబోతున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించారు.దీనికి బైడెన్ బదులిస్తూ.అప్పటికీ రిపబ్లికన్ పార్టీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటూ సెటైర్లు వేశారు తాను విధిని నమ్ముతానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని బైడెన్ వ్యాఖ్యానించారు.
కాగా, 78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్.అగ్రరాజ్య చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన దేశాధినేతగా రికార్డుల్లోకెక్కారు.2024 నాటికి ఆయనకు 82 ఏళ్లు వస్తాయి.ఇప్పటికే వృద్ధాప్యం సహా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న బైడెన్.
పూర్తి కాలం పదవీలో కొనసాగలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆయన వయసుపై విమర్శలు చేస్తూనే వున్నారు.
కొద్దిరోజుల క్రితం కమలా హారీస్ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు.అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.
ఇక తాజాగా ఎయిర్ఫోర్స్ వన్ ఎక్కుతూ మూడు సార్లు కాలు జారి కిందపడిపోవడంతో డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్లలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలపై బైడెన్ ప్రకటన అమెరికా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.