నవంబర్ 3 నుంచి జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అమెరికాలో సందడి మొదలైంది.రెండు ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలను రచించుకుంటున్నారు.
ఈ క్రమంలో డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జో బిడెన్ తన ప్రచార బృందంపై దృష్టి పెట్టారు.దీనిలో భాగంగా
డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా భారత సంతతికి
చెందిన మేధా రాజ్ను నియమించారు.
ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో డిజిటల్ ప్రచారంపైనే ఆయన దృష్టి పెట్టారు.ఈ సమయంలో వర్చువల్ సమావేశాలన్నింటికీ మేధా రాజ్ను చీఫ్గా నియమించారు.జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి మేధా రాజ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.స్టాన్ ఫోర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ చదివారు.తనను డిజిటల్ చీఫ్గా నియమించడం పట్ల మేధా రాజ్ హర్షం వ్యక్తం చేశారు.బిడెన్ ప్రచారంలో భాగస్వామ్యమవ్వడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ఎన్నికలకు ఇంకా 130 రోజులే సమయం వుందని, ఇకపై తాము ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదని నిర్ణయించుకున్నామని మేధా రాజ్ చెప్పారు.
77 ఏళ్ల జో బిడెన్ను ఆగస్టులో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ను పార్టీ తరపున అధికారికంగా అధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించనున్నారు.మరోవైపు ట్రంప్ ప్రచార సిబ్బందిలో ఎనిమిది మంది కరోనా బారినపడటంతో.బిడెన్ డిజిటల్ క్యాంపెయినింగ్కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు.