నేటితరుణంలో మహిళలకు భద్రత కరువైంది.అత్యాచారాలు ఎక్కువ అయిపోయాయి.
హర్యానాకు చెందిన జితేందర్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి అత్యాచారానికి గురైందని తెలిసి ఆమెను పెళ్లిచేసుకోవడానికి సిద్దపడ్డాడు.అలాగే ఆమెకు న్యాయం జరిగేవరకు పోరాడతానని నడుంబిగించాడు.
జితేందర్ మాట్లాడుతూ ‘నేను హర్యానాలోని ఛత్తర్ గ్రామవాసిని.నేను పక్క గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాను.ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం.మా పెద్దలు ఒప్పుకున్నారు.నిశ్చితార్థం కూడా జరిగింది.కానీ, ఓ రోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన గురించి వినాల్సి వచ్చింది.
నా భార్య ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మంది.నేను వెళ్లాను.
తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, పెళ్లిచేసుకోవడానికి తాను అర్హురాలిని కానని కుమిలిపోయింది.అది వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఎవరో చేసిన తప్పుకు ఆమెను శిక్షించడం సరికాదనిపించింది.ఆమెను పెళ్లిచేసుకుంటానని మాత్రమే కాదు.
న్యాయం జరిగేలా చూస్తానని కూడా మాటిచ్చాను.అలా మా పెళ్లికి ముందే నా న్యాయపోరాటం మొదలైంది.
నా స్థానంలో మరో అబ్బాయి ఉండుంటే కచ్చితంగా పెళ్లికి ఒప్పుకొనేవారు కాదు.పైగా తప్పు అమ్మాయిదే అనేవారు.కానీ నేను నా భార్యకు మాటిచ్చినట్లుగానే అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులపై కేసు పెట్టాను’
బెదిరింపులు రావడం మొదలయ్యాయి.వాటిని కూడా ఎదురుకున్నాను.కేసు గెలవడం కోసం రెండు ఇళ్ల స్థలాలు అమ్ముకున్నాను.నిందితులలో కొందరు పలుకుబడి ఉన్నవారట.దాంతో జిల్లా సెషన్స్ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది.దాంతో నేను హైకోర్టును ఆశ్రయించాను.
నా భార్య నిద్రపోవడానికి కూడా భయపడేది.దాంతో ఆమె కోసం నా వ్యాపారాలను వదులుకుని ఆమె పుట్టింటికి దగ్గర్లోనే ఓ ఇల్లు తీసుకున్నాను.
అలా దాదాపు 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాను.ప్రస్తుతం నేను లా చదువుతున్నాను.
పోలీసులు, న్యాయవాదులను నమ్ముకుంటే నాకు జరిగే మేలు ఏమీ లేదనిపించింది.అందుకే త్వరగా చదువు పూర్తిచేసి నా భార్య కేసును నేనే వాదించుకుంటాను.