దేశంలో కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.రైలు ప్రయాణాలపై పరిమితులు విధించడంతో పరిమిత సంఖ్యలోనే రైళ్లు తిరుగుతున్నాయి.
వ్యక్తిగత వాహనాలు ఉంటే మాత్రమే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం సాధ్యమవుతోంది.కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగించినా పలు రాష్ట్రాలు నేటికీ ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
పేద, మధ్య తరగతి ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.తాజాగా జార్ఖండ్ లోని గొడ్డా ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భార్య టీచర్ కావాలనే ఉద్దేశంతో ఏకంగా 1000 కిలోమీటర్ల దూరం బైక్ నడిపాడు.
పెళ్లయ్యాక కూడా భార్యకు పై చదువులు చదివే అవకాశం కల్పించడంతో పాటు భార్య కలను నెరవేర్చడం కోసం ఆ వ్యక్తి 1000 కిలోమీటర్ల దూరం బైక్ నడిపిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే గొడ్డాకు చెందిన ధనుంజయ్ కుమార్ అనే వ్యక్తి పదో తరగతి చదువుతో వంట మనిషిగా పని చేసేవాడు.
అతని భార్య సోని మధ్యప్రదేశ్ బోర్డు ద్వారా డిప్లొమా సెకండియర్ చదువుతోంది.ఆమెకు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఎగ్జామ్ సెంటర్ పడింది.
అక్కడికి కారులో వెళ్లాలంటే 30 వేల రూపాయలు చెల్లించాలని కారు డ్రైవర్లు డిమాండ్ చేశారు.అంత మొత్తం చెల్లించలేక ధనుంజయ్ భార్యను బైక్ పై 1000 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఆగస్టు 27 రాత్రి ప్రయాణాన్ని ప్రారంభించి ఆగష్టు 30 సాయంత్రానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.భార్యను టీచర్ చేయాలని ఆలోచనతో భర్త చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.