అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పటికీ టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని ఇబ్బంది పెడుతూనే ఉంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటుకు నోటు కేసు పెద్ద సంచలనం సృష్టించింది.
ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ ఈ కేసు విచారణ ప్రారంభమైంది.ఈ ఓటుకు నోటు కేసులో ఏ 4 నిందితుడు జెరూసలేం మత్తయ్య ఈ వ్యవహారం పై సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు.ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
ఈ కేసులో అప్రూవర్ గా మారడంతో తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే తనకు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయని చెప్పారు.
ఈ కేసులో ముఖ్య సూత్రధారులు చంద్రబాబు రేవంత్ రెడ్డి అన్నారు.అందుకే ఈ కేసు పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని మత్తయ్య ఫిర్యాదులో కోరారు.అలాగే ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.2015 లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం సంచలనం రేపింది.ఎమ్మెల్సీ ఎన్నికలలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేసిన ఆరోపణలతో రేవంత్ రెడ్డి సండ్ర వెంకటవీరయ్య, ఉదయ్ సింహాల పై ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసింది.
నామినేటెడ్ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి 50 లక్షలు నగదు ఇస్తున్న వీడియోలు సైతం అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపికి చెందిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఈ తతంగం అంతా జరిగినట్టు విమర్శలు వచ్చాయి.తాజాగా మత్తయ్య ఈ వ్యవహారంలో మరోసారి సంచలన విమర్శలు చేయడంతో మరోసారి ఓటుకి నోటు కేసుపై చర్చ జరుగుతోంది.