అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని విధంగా దూసుకెళ్లేందుకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పావులు కదుపుతున్నారు.కేవలం అంతరిక్ష పర్యాటకంపైనే దృష్టి పెడితే.
బెజోస్ అసలు సిసలు వ్యాపారవేత్త ఎలా అవుతారు.అందుకే ప్లాన్ మార్చారు.
అదేంటంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వున్న స్పేస్ ఏజెన్సీలతో భాగస్వామిగా మారడం.అంటే ఆయా సంస్థలు చేసే ప్రయోగాలకు సాంకేతిక సహకారంతో పాటు విడి భాగాలు తయారు చేయడమన్నమాట.
దీనిలో భాగంగానే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు బెజోస్ బంపరాఫర్ ప్రకటించారు.నాసా 2024లో చంద్రుడి మీదకు ప్రయోగం చేపట్టనుంది.ఇందుకోసం ఆర్టిమస్ ఆస్ట్రోనాట్లు ప్రయాణించే వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్) తయారీ బాధ్యతలను తమకిస్తే 200 కోట్ల డాలర్ల ( భారత కరెన్సీలో రూ.14,898 కోట్లు ) డిస్కౌంట్ ఇస్తానని బెజోస్ ప్రకటించారు.అయితే స్పేస్ క్రాఫ్ట్ నిర్మాణ ఒప్పందాన్ని గత ఏప్రిల్ లోనే ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కు నాసా అప్పగించిన సంగతి తెలిసిందే.సుమారు రూ.21,600 కోట్ల (290 కోట్ల డాలర్లు) కాంట్రాక్ట్ ను స్పేస్ ఎక్స్ కు అప్పగించింది.ఇదే సమయంలో బ్లూ ఆరిజిన్, డిఫెన్స్ కాంట్రాక్టర్ డైనెటిక్స్ బిడ్లను నాసా తిరస్కరించింది.
లాక్ హీడ్ మార్టిన్, నార్త్ రాప్ గ్రమ్న్, డ్రేపర్ లతో కలిసి బ్లూ ఆరిజిన్ బిడ్ వేసింది.
స్పేస్ ఎక్స్ కు ఆర్బిటాల్ ప్రయోగాల్లో ఉన్న అపార అనుభవం, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఎలన్ మస్క్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు నాసా సీనియర్ అధికారి కేథీ ల్యూడర్స్ చెప్పారు.ఈ నేపథ్యంలోనే నాసా అధిపతి బిల్ నెల్సన్ కు జెఫ్ బెజోస్ లేఖ రాశారు.కాంట్రాక్ట్ ను తమకు అప్పగిస్తే ప్రయోగంలో 200 కోట్ల డాలర్ల డిస్కౌంట్ ను ఇస్తామని స్పష్టం చేశారు.
నిర్ణయించిన కోట్ కే ఒప్పుకొంటామని, వ్యవస్థ అభివృద్ధికి అవసరమయ్యే అదనపు ఖర్చులను తామే భరిస్తామని బెజోస్ లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుతం సంస్థకు ఆర్థిక సమస్యలున్నా కూడా రెండు వర్గాల ద్వారా ఆదాయాన్ని సృష్టించే పద్ధతి నుంచి నాసా వెనక్కొచ్చేసిందని, తమకు అవకాశం ఇస్తే ఆ సమస్య తీరిపోతుందని ఆయన లేఖలో వివరించారు.
బెజోస్ లేఖ రాసిన విషయాన్ని ధ్రువీకరించిన నాసా.దానిపై స్పందించేందుకు మాత్రం నిరాకరించింది.స్పేస్ ఎక్స్ కు అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్ట్ కట్టబెట్టారని పేర్కొంటూ అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్కు ఇప్పటికే బెజోస్ లేఖ రాశారని నాసా గుర్తు చేసింది.మరోవైపు అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రిచర్డ్ బ్రాన్సన్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే.
తొలుత బెజోస్ అంతరిక్ష యాత్ర గురించి ప్రకటించగా.ఆయన కంటే ముందే రోదసిలోకి వెళ్లిన ఘనతను దక్కించుకున్నారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్.అయితే వర్జిన్ కంటే ఎత్తుకు వెళ్లి ప్రత్యేకత చాటుకున్నారు బెజోస్.వర్జిన్ గెలాక్టిక్ కంటే మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్’ యాత్ర సాగింది.
బ్రాన్సన్ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.నేల నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న సంగతి తెలిసిందే.బెజోస్ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు.అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు.
అయితే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (ఎఫ్ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది.దీంతో బెజోస్ 106 కిలోమీటర్లు అంతరిక్ష యాత్ర చేశారు.