ప్రపంచంలో ఉన్న సంపన్నుల్లో చాలా మంది డబ్బు సంపాదించడమే పనిగా కాకుండా తమను ఇంతవారిని చేసిన సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటారు.మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, రతన్ టాటా, అజీమ్ ప్రేమ్జీ లాంటి వాళ్లు సామాజిక సేవా కార్యక్రమాల కోసం వేల కోట్లు విరాళాలు అందిస్తున్నారు.
తాజాగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ఎన్నో దుష్పరిణామాలను చవిచూస్తోంది.ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు గాను సుమారు 10 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.72 వేల కోట్లు తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.క్లైమేట్ చేంజ్పై పోరాటం కోసం బెజోస్ ఎర్త్ ఫండ్ కింద ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు బెజోస్ తన ఇన్స్టాగ్రామ్లో తెలిపారు.పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ఎన్జీవోలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చునని ఆయన వెల్లడించారు.
ఇంటి దగ్గరకే వస్తువులను డెలీవరీ చేస్తున్న అమెజాన్ వల్ల చాలా వరకు వ్యర్థాలు మిగిలిపోతున్నాయని.ఆ సంస్థ ఉపయోగించే వాహనాల వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ వేత్తలు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు.వాతావరణ మార్పు సమస్యలను నివారించడంలో అమెజాన్ తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న పాలసీలు ఏ మాత్రం బాగోలేవని, పర్యావరణ పరిరక్షణ కోసం మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ ఆ కంపెనీ ఉద్యోగులే విమర్శలు చేస్తున్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో బెజోస్ ఈ విరాళం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.