ఇప్పటి వరకు అంతరిక్షంలోకి వ్యోమగోములు, ఇతర వ్యోమనౌకలు తప్ప సాధారణ మనుషులు వెళ్లింది లేదు.ప్రపంచంలోని ఎంతో మందికి ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలని, అక్కడికి వెళ్లాలని ఆశ.
కానీ నిన్న మొన్నటి వరకు కూడా అది అసాధ్యం.ఎందుకంటే రోదసీలోకి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు.
ఇలాంటి వారి కలను నిజం చేసే అంతరిక్ష పర్యాటకానికి మార్గం సుగమం చేసేందుకు కొన్ని సంస్థలు దశాబ్ధాలుగా కృషి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే అమెరికా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన సంగతి తెలిసిందే.
ఈ నెల 11న వర్జిన్ గెలాక్టిక్కు చెందిన వీఎస్ఎస్ యూనిటీ 22 ద్వారా రిచర్డ్ బ్రాన్సన్ తన బృందంతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.సుమారు 90 నిమిషాల పాటు రోదసీలో గడిపి విజయవంతంగా భూమిని చేరారు.
ఈ బృందంలో మన తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా వున్నారు.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వర్జిన్ గెలాక్టిక్ పేరు మారుమోగుతోంది.
అంతేకాదు త్వరలోనే మరికొందరిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ సంస్థ బుకింగ్స్ కూడా చేసుకుంది.అయితే రోదసీ యాత్రకు శ్రీకారం చుట్టాలని తొలుత బ్రాన్సన్ భావించలేదు.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా అంతరిక్షంలోకి వెళ్తున్నట్లు ప్రకటించడంతో అందుకు పోటీగా రిచర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతో బెజోస్ కంటే ముందే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసి.
అమెజాన్ అధినేతకు దక్కాల్సిన రికార్డును లాగేసుకున్నారు.
దీంతో ఇప్పుడు జెఫ్ బెజోస్ యాత్రపై అందరి దృష్టి నెలకొంది.ఈ నెల 20న బ్లూ ఆరిజన్ రోదసీలోకి వెళ్లనుంది.ఇందుకు సంబంధించి జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష యాత్రకు అమెరికా ప్రభుత్వం అనుమతినిచ్చింది.
వచ్చే మంగళవారం వీరు పశ్చిమ టెక్సాస్ నుంచి ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేసి వస్తారు.ఇందులో బెజోస్, ఆయన సోదరుడు, 82 ఏళ్ల వయసున్న ఏవియేషన్ నిపుణురాలు, 2.8 కోట్ల డాలర్ల వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తి వున్నారు.అందరికంటే ముందే అంతరిక్ష యాత్ర ప్రకటించినప్పటికీ మధ్యలో వర్జిన్ గెలాక్టిక్ సంచలనం సృష్టించడంతో ఇప్పుడు ఆ సంస్థ కంటే ఏదో ఒక ప్రత్యేకత బ్లూ ఆరిజన్కు తీసుకురావాలని బెజోస్ భావిస్తున్నారు.
దీనిలో భాగంగా బ్రాన్సన్ బృందం కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లాలని ప్రణాళిక రచిస్తున్నారు.వర్జిన్ గెలాక్టిక్ భూమి నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లారు.ఇక బ్లూ ఆరిజిన్కు చెందిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక మాత్రం దాదాపు 106 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుందని ఆ సంస్థ చెబుతోంది.మరి ఏం జరుగుతోందో తెలియాలంటే జూలై 20 వరకు ఎదురుచూడాల్సిందే.