ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో సతమతమయ్యే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అంతా సర్దుకునేలా చేశారని ,ఇక కాంగ్రెస్ అధికారం వైపు అడుగులు వేస్తుందని అభిప్రాయపడుతున్నారు.ఆ పార్టీలో పిసిసి అధ్యక్షుడి నియామకం తాలూకా లుకలుకలు ఇంకా ఉన్నట్లుగా కనిపించడం లేదు.
కొంతమంది అడ్జెస్ట్ అవ్వగా, కొంత మంది అసంతృప్త నాయకులు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలపైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి.
బిజెపి టిఆర్ఎస్ పోటాపోటీగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం ఇంకా సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే బిజీగా ఉన్నట్టు గా వ్యవహరిస్తోంది.ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యవహారం కాంగ్రెస్ లో చర్చనీయాంశం అవుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఇద్దరు నాయకులు హైదరాబాద్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నిర్వహిస్తున్న పార్టీ సన్నాహక సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది.కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
అభ్యర్థిని ఎంపిక చేసే పనిలోనే రేవంత్ నిమగ్నమయ్యారు.ఇది ఇలా ఉంటే రామగుండం లో నిర్వహించిన పార్టీ సమావేశానికి హాజరైన జీవన్ రెడ్డి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి రాకపోవడం వెనుక కారణాలేంటి అనేది అంతుబట్టడం లేదు.
జీవన్ రెడ్డి కి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ముందే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్లు కాంగ్రెస్ పెద్దలు కొంతమంది వర్తమానం పంపారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దానిని వాయిదా వేశారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత తనతో పిసిసి అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పై చర్చించకపోవడం, సైలెంట్ గా రేవంత్ ను ఎంపిక చేయడం వంటివి జీవన్ రెడ్డి కి అసంతృప్తిని రాజేస్తున్నాయి.ఇక శ్రీధర్ బాబు విషయానికొస్తే, మంథని ఎమ్మెల్యే గా ఉన్న శ్రీధర్ బాబు హుజూరాబాద్ నియోజకవర్గం అతి సమీపంలోనే ఉంటారు.
ఆయన పిసిసి అధ్యక్ష పదవిని ఆశించారు.ఆయనకు ఆ పదవి వరిస్తుందని ప్రచారం జరిగినా, అది దక్కక పోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు.ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించిన మీటింగ్ కు జీవం రెడ్డి తో పాటు, శ్రీధర్ బాబు హాజరుకాకపోవడంతో కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఇంకా సమసిపోలేదు అనే విషయం బహిర్గతమవుతోంది.