కరోనా నేపథ్యంలో గత కొద్దీ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలి అంటూ నమోదు అయిన తాజా పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను గత మూడు నెలలు గా వాయిదా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే సెప్టెంబర్ లో నిర్వహించాల్సిన ఆ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలి అంటూ 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయగా , దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటీషన్ ను కొట్టివేసింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా, బీఆర్ గవాయి, కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించగా, కోవిడ్ మరో ఏడాది కొనసాగే అవకాశాలు ఉన్నాయి, మరి మీరు మరో సంవత్సరం ఇలాగే ఎదురుచూస్తారా అని ప్రశ్నించింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా .పిటిషన్ వేసిన విద్యార్థుల్ని ప్రశ్నించారు.కరోనా నేపథ్యంలో ఏప్రిల్,మే నెలల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తూ సెప్టెంబర్ లో నిర్వహించడానికి నిర్ణయించిన విషయం విదితమే.అయితే దేశంలో రోజు రోజుకు ఏర్పడుతున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలంటూ 11 మంది విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ఈ పరీక్షల్ని వాయిదా వేస్తే విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది.పరీక్షల్ని నిర్వహించకపోతే విద్యార్థులు తమ అకడమిక్ ఇయర్ కోల్పోతారని జస్టిస్ అరుణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేసే విషయంలో కోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.మరో ఏడాది పాటు ఈ కరోనా పరిస్థితులు ఇలానే కొనసాగితే మరో సంవత్సరం ఇలానే ఎదురు చూస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఆ పిటీషన్ ను కొట్టివేసింది.