ప్రపంచంలోని అన్ని రంగాలపై పెను ప్రభావం చూపిన కరోనా వైరస్ విద్యారంగాన్ని సైతం వదిలిపెట్టలేదు.ఇప్పటికే లాక్డౌన్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలుకంటున్న వారికి తీవ్ర నిరాశను కలిగించింది.ఈ క్రమంలో విదేశాల్లో చదువుకోవాలని నిర్ణయించుకుని, కరోనా కారణంగా మనసు మార్చుకుని భారతదేశంలోనే చదువుకోవాలని భావిస్తున్న విద్యార్ధులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఇంటర్మీడియట్, +2 తర్వాత దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల్లో టెక్నికల్, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ బుధవారం ప్రకటించారు.ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువు ఫిబ్రవరిలోనే ముగిసిపోయినప్పటికీ కోవిడ్ 19 కారణంగా విజ్ఞప్తులు రావడంతో మరో అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్ధులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోనికి తీసుకుని మరోసారి జేఈఈ దరఖాస్తులను తీసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వినీత్ జోషికి సూచించానని పోఖ్రియాల్ వెల్లడించారు.విదేశాలకు వెళ్లే ఆలోచన విరమించుకున్న వారితో పాటు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా ఇప్పుడు అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పోఖ్రియాల్ చెప్పారు.
మే 19 నుంచి 24 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలని సూచించారు.
కాగా లాక్డౌన్ కారణంగా మే నెలలో జరగాల్సిన జేఈఈ -మెయిన్ ఎగ్జామ్.జూలై 18 నుంచి 23 మధ్య నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది.జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఆగస్టు మాసంలో నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది.కానీ, ఏ రోజున ఈ పరీక్షలు నిర్వహిస్తామనే విషయాన్ని స్పష్టం చేయలేదు.
లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు కొన్ని ప్రవేశ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.