పట్నా: బీహార్లో జనతాదళ్(యునైటెడ్)(జేడీయూ)కి చెందిన ఒక ఎమ్మెల్యే అర్థ నగ్నంగా కనిపించడమే కాకుండా నానా హంగామా చేశారు.తరచూ వివాదాల్లో కనిపించే భాగల్పూర్లోని గోపాల్పూర్ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ ఉరఫ్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.
రాజేంద్ర నగర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్లో ఆయన కేవలం లోదుస్తులు ధరించి తిరుగుతున్న ఉదంతానికి సంబంధించిన ఒక ఫొటో వైరల్గా మారింది.సదరు ఎమ్మెల్యే ఇలా తిరుగుతుండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఒక ప్రయాణికుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతనిని నిందిస్తూ చిందులు తొక్కారని సమాచారం.
వారి గొడవ తీవ్రం కావడంతో ఆర్ పిఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ పట్నా-న్యూఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్లోని ఎ-1 కోచ్ లో కేవలం చెడ్డీ, బనీను ధరించి తిరుగుతున్నారు.
ఈ చర్యకు అక్కడున్న ఒక ప్రయాణికుడు అభ్యంతం వ్యక్తం చేశారు.
రైలు పట్నాలో బయలుదేరిన వెంటనే ఎమ్మెల్యే తన బట్టలు విప్పేసి, కేవలం లోదుస్తులతో ఆ కోచ్ లో కలియతిరిగారు.టాయిలెట్ వైపు వెళ్లి కూడా వచ్చారు.దీనిని గమనించిన ఒక ప్రయాణికుడు ఎమ్మెల్యేకి ఏదో చెప్పబోయేంతలో సదరు ఎమ్మెల్యే ఆ ప్రయాణికునిపై తిట్ల యుద్ధం ప్రారంభించారు.
ఇరురు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.కాగా ఈ ఉదంతంపై బాధిత ప్రయాణీకుడు ప్రహ్లాద్ పాశ్వాన్ ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయలేదు.