సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.నిజాయితీకి మారుపేరు అన్నట్టుగా ఉన్న లక్ష్మి నారాయణ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణాధికారిగా రావడంతో పాటు జగన్ ను జైలుకు కూడా వెళ్లేలా చేయడంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.
ఆ తరువాత తన ఉదోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వైసీపీ మినహా అన్ని పార్టీల్లోనూ చేరుతారనే ప్రచారం జరిగింది.కానీ ఆయన మాత్రం ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.
కానీ అదీ జరగలేదు.
ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని, ఆయన కోసం విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే సీటు కూడా రిజర్వు చేసిపెట్టారని చెబుతున్నారు.
నిన్నటి వరకూ బీజేపీ సానుభూతిపరుడిగా కనిపించిన లక్ష్మినారాయణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు ? జనసేనతో కూడా భావసారూప్యతలున్న జేడీ సాంప్రదాయ రాజకీయ పార్టీ టీడీపీకి ఎందుకు సరెండర్ అవుతున్నారు అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు సొంత పార్టీ పెడతానన్న లక్ష్మినారాయణ ను టీడీపీ ఎలా ట్రాప్ చేసింది అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి లక్ష్మీనారాయణ ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ముందుగా ఇక్కడి నుండి నారా లోకేశ్ పోటీ చేయాలని భావించినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీచేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.లక్ష్మీనారాయణ, సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీలోకి వచ్చేందుకు ఒకే చెప్పినట్టు , రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
వైసీపీ మాత్రం లక్ష్మీ నారాయణ ముందు నుంచి టీడీపీ మద్దతుదారుడి అని చెబుతున్నా ఎవరూ నమ్మలేదని ఇప్పుడు అదే జరిగిందని చెబుతున్నారు.ఇక ఆయన టీడీపీ లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.