తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది.నిన్ననే టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అచ్చెన్న నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా తాజాగా అనంతపురం జిల్లా కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ని అదేవిధంగా అరెస్ట్ చేశారు.ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత రెడ్డిని కూడా హైదరాబాదులో అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.
ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అవుతారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా 154 బస్సులు నకిలీ ఎన్ ఓ సీ, ఫేక్ ఇన్సూరెన్స్ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఇదే కాకుండా బీఎస్ 3 వాహనాల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.ఈ వ్యవహారంలో గతంలోని ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.అనంతపురం కేంద్రంగా జాతీయ స్థాయిలో భారీ కుంభకోణానికి పాల్పడినట్లుగా వారిపై అభియోగాలు నమోదయ్యాయి.154 వాహనాలు ఏపీ, నాగాలాండ్, కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నాయని ఒకే ఇన్సూరెన్స్ పాలసీ పై నాలుగైదు వాహనాలకు చూపించినట్లు రవాణా శాఖ గుర్తించింది.అలాగే గోపాల్ రెడ్డి , జటాధర కంపెనీల పేరుతో అశోక్ లేలాండ్ స్క్రాప్ ను వీరు అమ్మినట్లు ఆరోపణలు జెసి పై వచ్చాయి.దీనిపై కేసు నమోదు కావడంతో ఎప్పుడో ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా, అకస్మాత్తుగా ఇప్పుడు అరెస్టు చేయడానికి కారణం ఉంది.
కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంపై దివాకర్ ట్రావెల్స్ మేనేజర్ నాగేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేయడంతో ప్రభాకర్ రెడ్డి తో పాటు మరో నలుగురు పైన పోలీసులు కేసు నమోదు చేశారు.అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద లారీ ఓనర్ లు ధర్నాకు దిగారు.లారీ ఇంజన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలను సీజ్ చేయడానికి కారణం మీరే అంటూ వారు ధర్నాకు దిగారు.ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున అరెస్టుల జరగబోతున్నాయి అనే ప్రచారం ఊపందుకుంది.
టిడిపి కీలక నాయకులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రచారం జరిగింది.దానికి తగ్గట్టుగానే అచ్చెన్న నాయుడు, ఇప్పుడు జెసి దివాకర్ రెడ్డి ఇంకా అనేక మంది పేర్లు అరెస్ట్ అయ్యే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.