ఏపీలో రాజధాని వ్యవహారం మీద రాజకీయ పార్టీలు తర్జనభర్జన పడుతుండగానే ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తెరపైకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అలా చేయకపోతే గ్రేటర్ రాయలసీమ ప్రకటించాలంటూ అనంతపురం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకువచ్చారు.
ఒకవేళ ఏపీలో రాజధాని మార్పు జరిగితే మాత్రం ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనంటూ ఆయన పట్టుబడుతున్నారు.తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రాజధాని విషయంపై ఆయన చర్చించారు.
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించని పక్షంలో గ్రేటర్ రాయలసీమ ప్రకటించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.గతంలోనూ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అనే వాదనను తెరమీదకు తెచ్చారు.
రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కూడా అప్పట్లో జేసీ డిమాండ్ చేశారు.ప్రస్తుతం జగన్ పై పీకల వరకు కోపం పెంచుకున్న జేసీ ఇప్పుడు ఆయనను మరింత ఇబ్బంది పెట్టే విధంగా రాయలసీమ వాదనను తెరమీదకు తెచ్చినట్టుగా అర్థమవుతుంది.