ఏపీ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉంది.ఆయన ఏ పార్టీలో ఉన్నా, అధికారంలో ఏపార్టీ ఉన్నా, తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.
సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ అనే తేడా లేకుండా అందరి పైన విమర్శలు చేస్తూ, తాను ఎవరికీ భయపడను అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు జెసి దివాకర్ రెడ్డి.అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు.
ఈ జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం నుంచి 35 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యే గా కొనసాగారు అంటే ఆయనకు ఆ ప్రాంతంలో ఎంత పట్టు ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటూ, ఆ తరువాత టిడిపిలో చేరిన దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా, విజయం తన ఖాతాలోనే వేసుకున్నారు.
అయితే 2019 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.
తన స్థానంలో తన కుమారుడు పవన్ రెడ్డి ని అనంతపురం పార్లమెంటు నుంచి పోటీకి దింపారు.
అయితే పవన్ ఓటమి చెందడంతో అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్నారు.అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్థికంగా , మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టిడిపిలో ఉన్న తమకు పెద్దగా ఉపయోగం లేదని, తమను వైసిపి ప్రభుత్వం వేధిస్తున్నా, టిడిపి పెద్దగా పట్టనట్టుగా వ్యవహరిస్తోందనే ఆగ్రహం దివాకర్ రెడ్డి లో చాలాకాలం నుంచి ఉంది.ఇక టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, తమ కుటుంబం పై రాజకీయ వేధింపులు పెరిగిపోతుండటం, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఎలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న దివాకర్ రెడ్డి బిజెపిలో చేరితేనే వీటన్నిటి నుంచి రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుందని ఎప్పటి నుంచో భావిస్తున్నారు.
బిజెపిలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ మేరకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిగాయి.అయితే తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తేనే బీజేపీలో చేరుతానని షరతులు విధించాడట.ఈ విషయంలో బిజెపి సైతం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే దివాకర్ రెడ్డి బిజెపి పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారట.
అయితే తాజాగా బిజెపికి చెందిన ఓ కీలక నాయకుడు దివాకర్ రెడ్డిని కలిసి పార్టీ అధిష్టానం మీ విషయం సానుకూల వైఖరితో ఉందని, పార్టీలో ముందుగా యాక్టివ్ అయితే, ఆ తర్వాత పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని, ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వం పై ఆశలు పెట్టుకోవద్దని దివాకర్ రెడ్డి చెప్పడంతో, ఆయన డైలమా లో పడ్డారట.
ప్రస్తుతం తన వయసు రీత్యా చూసుకుంటే ఎంతోకాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదని, ఇప్పుడు పదవి లేకుండా బిజెపి లో చేరితే ఉపయోగం ఏమి ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట.అయితే ప్రస్తుతం తమ కుటుంబం రాజకీయంగా వేధింపులకు గురవుతూ ఉండడంతో బిజెపిలో చేరితేనే తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుందనే అభిప్రాయంలో దివాకర్ రెడ్డి ఉన్నారట.