ఏపీలో ప్రస్తుతం రాజకీయ వలసలు జోరందుకున్నాయి.టిడిపి నుంచి వైసీపీలోకి, బీజేపీలోకి వెళ్లేందుకు నాయకులు క్యూ కడుతున్నారు, ఇప్పటికే కొంతమంది చేరిపోగా మిగిలిన వారు సరైన అనుకూలమైన సమయం కోసం వేచి చూస్తున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని అవినాష్ , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడగా సుమారు పది మంది వరకు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు.అయితే తానేమి తక్కువ తిన్నానా అంటూ పార్టీ మారేందుకు అనంతపురం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా క్యూలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా ఆయన వైఎస్సార్సీపీలోకి వెళ్లేందుకు పావులు కదిపినా జగన్ ఆయన రాకను అడ్డుకున్నారు.అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులను ఆర్టీఏ అధికారుల ద్వారా దాడులు జగన్ చేయించాడని ఆగ్రహంతో దివాకర్ రెడ్డి రగిలిపోతున్నారు.
ఒకానొకదశలో ట్రావెల్స్ వ్యాపారం మానేస్తే బెటర్ అన్న స్థితికి జేసీ వచ్చేశారు.ప్రస్తుతం ఎలాగూ టీడీపీ పుంజుకునే పరిస్థితి లేకపోవడం, వైసీపీ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండడంతో బీజేపీని షెల్టర్ జోన్ గా వాడుకోవాలని జేసీ చూస్తున్నాడట.
అయితే తాను టిడిపిలోనే ఉంటానని, పార్టీ మారే ఉద్దేశం లేదంటూ పైకి చెబుతున్నారు.బిజెపి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జేసీ కాషాయ కండువ కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన అనుచరులు సైతం అంగీకరిస్తున్నారు.