తెలుగులో ఇటీవలే యంగ్ దర్శకుడు అనుదీప్ కె.వి దర్శకత్వం వహించిన “జాతి రత్నాలు” చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేయడంతో పాటు దర్శకనిర్మాతలకి కలెక్షన్ల వర్షం కురిపించింది.
కాగా ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అలాగే ప్రముఖ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఆరడుగుల బ్యూటీ ఫరియ అబ్దుల్లా, బ్రహ్మాజీ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి “ఔరా” అనిపించింది.
కాగా తాజాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అనుదీప్ కె.వి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఈ చిత్రాన్ని కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే తెరకెక్కించామని అంతేతప్ప ఎలాంటి మెసేజ్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం కాదని స్పష్టం చేసాడు.అందువల్లనే మెయిన్ థీమ్ పై ఆధార పడకుండా కామెడీ సన్నివేశాలపై ఎక్కువగా దృష్టి సారించామని తెలిపాడు.
అయితే ఈ చిత్రంలోని కోర్టు సన్నివేశంలో జడ్జిగా నటించిన బ్రహ్మానందం స్థానంలో వేరే నటుడని అనుకున్నామని, కానీ అనుకోకుండా బ్రహ్మానందం గారిని నటింపచేయాల్సి వచ్చిందని అందువల్లనే మొత్తం కథ డిస్ట్రబ్ కాకుండా బ్రహ్మానందం గారికి తక్కువ సన్నివేశాలు, డైలాగులు ఉండేవిధంగా చూసామని తెలిపాడు.అయితే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన నాగ్ అశ్విన్ కూడా చాలా సహాయం చేసాడని తెలిపాడు.
అయితే జాతి రత్నాలు సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన కొందరు దర్శక నిర్మాతలు ఫోన్ చేసి అభినందిస్తున్నారని తెలిపాడు.అంతేకాకుండా పలు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని, తన నెక్స్ట్ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నట్లు కూడా తెలిపాడు.
అయితే కేవలం తాను రాసుకున్న కథలని మాత్రమే కాకుండా ఇతరులు రాసిన కథలు తనకి నచ్చితే దర్శకత్వం వహించి వారికి క్రెడిట్స్ కూడా ఇస్తానని స్పష్టం చేసాడు.