టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.సైబర్ నేరాలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
మహిళలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.ఇలాంటి సైబర్ నేరగాళ్ల బెదిరింపులు తట్టుకోలేక జపాన్కు చెందిన యువ రెజ్లర్, నెట్ఫ్లిక్స్ రియాల్టీ షో సభ్యురాలు హనా కిమురా (22) ఆత్మహత్య చేసుకుంది.
ఈ వార్త తెలిసిన ఆ దేశ రెజ్లింగ్ ఆర్గనైజేషన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.కిముర ప్రొఫెషనల్ రెజ్లర్గా మాత్రమే కాకుండా నెట్ఫ్లిక్స్లో మంచి ఆదరణ పొందిన ‘టెర్రస్ హౌస్’ అనే రియాల్టీ షోలోనూ కిమురా సభ్యురాలిగా ఉంది.
ఈ షోలో భాగంగా ఒకే ఇంట్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు కలిసి జీవిస్తున్నారు.అయితే ఈ షోలో ఆమె ప్రవర్తన గురించి గత కొన్నిరోజులుగా వీక్షకుల నుంచి సైబర్ బెదిరింపులు ఎదుర్కొంటుందని స్థానిక మీడియా వెల్లడిస్తుంది.
ప్రస్తుతం కరోనా కారణంగా ఈ షో కొన్నిరోజులుగా నిలిచిపోయినప్పటికీ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు.అయితే ఈ సైబర్ బెదిరింపులను భరించలేకనే కిమురా ఆత్మహత్యకు పాల్పడినట్టు జపాన్ మీడియా చెబుతోంది.
అయితే, చనిపోయే ముందు కిముర ట్విట్టర్లో స్పందిస్తూ.రోజూ వందకు పైగా మెస్సేజ్లు వస్తున్నాయనీ, అవి ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నాయని ఆమె వాపోయింది.
‘ఈ జీవితాన్ని ఎంతో ఇష్టపడ్డాను.కానీ నేను చాలా బలహీనురాలిని.నన్ను క్షమించండి.ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించాలనుకోవడం లేదు, మద్దతుగా నిలిచినవారందరికీ థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేసింది.
దీంతో పాటు ఇన్స్టాలోనూ చివరగా తన పిల్లితో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘ఐ లవ్ యూ.క్షమించు’ అని క్యాప్షన్ పెట్టినట్లు తెలుస్తుంది.కాగా, కిమురా ఆత్మహత్యతో అజ్ఞాత బెదిరింపులు, ద్వేషపూరిత మెస్సేజ్లను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.కిమురా మృతి పట్ల రిటైర్డ్ రెజ్లర్, హాలివుడ్ నటుడు మిక్ ఫోలే కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.