కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం అర్హులైన కాపు మహిళల బ్యాంకు అకౌంట్ లో నేరుగా 15 వేల రూపాయలు సొమ్ములు జమ చేసింది.దీనిద్వారా కాపు సామాజిక వర్గం మొత్తం తమవైపు తిరుగుతుందని, అధికారపార్టీ అంచనావేసింది.
అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంలో స్పందించారు.ఈ పథకం చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ, ఆయన అనేక విమర్శలు చేశారు.
దీనిపై అధికార పార్టీ మంత్రులు పవన్ సామాజికవర్గానికి చెందిన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పవన్ పై విమర్శలు చేశారు.ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్లు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారాన్ని అధికార పార్టీ హైలెట్ చేసింది.
గత టీడీపీ ప్రభుత్వం లో ముద్రగడ పద్మనాభం ను అరెస్ట్ చేయించడమే కాకుండా, అనేక ఇబ్బందులకు గురి చేసినా, అప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని, కేవలం ఇప్పుడు మాత్రమే వైసీపీపై ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు అంటూ అధికార పార్టీ పవన్ పై విమర్శలు చేసింది.
దీనికి జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేస్తున్నారు.
ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ముద్రగడ ఎక్కడా నోరు విప్పడం లేదు.దీనితో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు నేస్తం పథకం పై కాపులకు కేటాయించిన నిధులపై పవన్ అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.వాటికి నేరుగా సమాధానం చెప్పకుండా, చంద్రబాబు ముద్రగడ అంశాన్ని అధికార పార్టీ నాయకులు హైలెట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ వ్యవహారశైలిపై జనసేన అనేక ప్రశ్నలు సంధిస్తోంది.గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు, ముద్రగడ చిరంజీవికి మద్దతు పలకపోగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేసి ఓటమి చెందారని, ప్రజారాజ్యం అభ్యర్థి వంగా గీత చేతిలో ఓటమి చెందారని, జనసైనికులు గుర్తు చేస్తున్నారు.
ఇక ఆ తరువాత జనసేన పేరుతో పవన్ పార్టీ పెట్టినా వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, సొంత సామాజిక వర్గం ను ముద్రగడ పట్టించుకోవడంలేదని, జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.కాపు నేస్తం నిధులు విడుదల పై జగన్ శ్వేతపత్రం ఇవ్వాలని, గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులను పేరు మార్చి మరో రకంగా వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని పవన్ విమర్శలు చేస్తున్నా, కాపు ల అంశంపై ముద్రగడ మాట్లాడకుండా, ఈ వ్యవహారం లో తనకేమీ సంబంధం లేదన్నట్లు మౌనంగా ఉండిపోవడంతో, జనసైనికులు ముద్రగడ తీరుపై తీవ్ర అసహనం తో రగిలిపోతున్నారు.