ఇంటా బయటా తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపించడంలేదు.అధికార పార్టీ వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండడం, అదే సమయంలో టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపించే వారు కరువవడంతో సమర్ధవంతంగా అధికార పార్టీని టీడీపీ ఎదుర్కోలేకపోతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ దూకుడుకి ఎలా అయినా బ్రేకులు వేయాలని చూస్తున్న చంద్రబాబుకు ఇప్పుడో మార్గం కనిపించిందట.అదే జనసేనతో టీడీపీ దోస్తీ గురించి.
తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్కసీటు మాత్రమే సంపాదించినా మిగతా చోట్ల జనసేన ఓటింగ్ శాతం గణనీయంగా నమోదయ్యింది.దానికి తోడు పవన్ కి ఉన్న బలమైన అభిమానుల మద్దతు కూడా టీడీపీకి లభిస్తుంది అన్న ఆలోచనతో జనసేనతో కలిసి వెళ్లాలనే ఆలోచనలో బాబు ఉన్నట్టు ప్రచారం మొదలయ్యింది.
ఈ మేరకు టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు పవన్ తో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.ఇటీవల కాలంలో ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఇప్పుడు ఈ ఇరు పార్టీలు కలిసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీ హావాను తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాయట.
వాస్తవానికి తెలుగుదేశం, జనసేన శాసనసభ, లోకసభ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరిగింది.అయితే అది ప్రతిపాదనల దశలోనే ఆగిపోయింది.అప్పట్లో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లేందుకు వెనకడుగు వేసాయి.
ఆ ఎన్నికల్లో త్రిముఖ పోరు కారణంగా జనసేన, టీడీపీ రెండు ఘోరంగా దెబ్బతిన్నాయి.
అందుకే ఇప్పుడు అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసిపిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రెండు పార్టీలు పొత్తుకు సిద్ధం అవుతున్నాయట.పవన్ టీడీపీ కి మధ్య 2014 నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అసలు 2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు.అప్పట్లో పవన్, బీజేపీ మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు పవన్, టీడీపీ కాంబినేషన్ కుదిరితే వైసీపీకి చెక్ పడ్డట్టేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.ఈ రెండు పార్టీల పొత్తుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.