2024 ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో జనసేన ఉంది.అందుకే తమకు కలిసి వచ్చే ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా పోరాడాలని చూస్తోంది.
కోట్లాది మంది అభిమానులు, బలమైన సామాజిక వర్గం, సినీ గ్లామర్ అన్నీ ఉన్నా తాము ఎందుకు వెనుకబడి పోతున్నాము అనే విషయంపై ఇప్పుడు జనసేన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.బలమైన పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, వైఎస్సార్సీపీ లను ఎదుర్కోవాలంటే మరింత బలోపేతం అవ్వాలని, ఆ రెండు పార్టీలకు ధీటుగా 2024 నాటికి తయారవ్వాలి అనేది జనసేన ఆలోచన.దానిలో భాగంగానే ఇప్పుడు పార్టీలోని లోపాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిపెట్టింది.2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమి చెందడానికి కారణం సొంతంగా మీడియా లేకపోవడం.అప్పటికే ఉన్న మెజార్టీ మీడియా సంస్థలు ప్రజారాజ్యం పార్టీని వ్యతిరేకించి మిగతా రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలబడటం వంటి కారణాలతో ఘోరంగా పార్టీ ఓటమి చెందింది.ప్రజారాజ్యం వాయిస్ చెప్పుకునేందుకు అవకాశం లేకుండా నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరిగిందని, ఇప్పుడు జనసేన విషయంలో కూడా అదే జరుగుతుందని పవన్ సైతం ఇప్పుడు తీరిగ్గా విశ్లేషించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఎప్పటి నుంచో సొంతంగా పత్రిక, న్యూస్ ఛానల్ పెట్టాలని పవన్ పై ఒత్తిడి వస్తున్నా, ఆ విషయాన్ని పవన్ పెద్దగా పట్టించుకోలేదు.ఇక పార్టీ కీలక నాయకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 99 చానల్ ఏర్పాటు చేసినా, అది ఆశించినంత స్థాయిలో జనసేన కు ఉపయోగపడలేదనేది జనసేన నాయకుల వాదన.
జగన్ కు సాక్షి పేపర్, టీవీ ఛానల్ ఉండబట్టే ఆయన ప్రతిపక్షంలో ఉండగా తన వాయిస్ ను బలంగా వినిపించుకునేందుకు, పార్టీ తరపున చేసే ఉద్యమాలు, ఆందోళనలు హైలెట్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందని, అదే లేకపోతే జగన్ కు ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఉండేది కాదని జనసైనికులు చెబుతున్న మాట.ఈ విషయాల పైన పవన్ సీరియస్ గా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసేన దూసుకుపోతుంది.ప్రత్యేకంగా శతఘ్నిటీమ్ సోషల్ మీడియాలో బలంగా ఉంది.అయితే కేవలం కొద్దిమందికి మాత్రమే అది రీచ్ అవుతుందని, అదే సొంతంగా ఛానల్, పేపర్ ఉంటే జనసేన చేసే ప్రజా ఉద్యమాలు, ఆందోళన గురించి చెప్పుకునే అవకాశం ఉంటుందని జనసైనికులు చెబుతున్న మాట.
మొన్నీమధ్యనే వైన్ షాపుల వద్ద టీచర్లను కాపలాగా ఉంచాలని జగన్ నిర్ణయాన్ని మొదటగా పవన్ ప్రశ్నించారు.వెంటనే అదే విషయం పై చంద్రబాబు కాస్త ఆలస్యంగా స్పందించారు.కానీ మీడియాలో మాత్రం చంద్రబాబు వెర్షన్ మాత్రమే హైలెట్ చేసి చూపించడంతో ఆ క్రెడిట్ అంత టిడిపికి వెళ్లిపోయిందని జనసైనికులు ఉదాహరణగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కూడా సొంతంగా, పత్రిక ఛానల్ ఏర్పాటు చేస్తే కానీ 2024 ఎన్నికల్లో తమకు అవకాశం ఉండదనే నిర్ణయానికి వచ్చి ఇప్పుడు సొంత మీడియా ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.