ప్రస్తుతం ఏపీలో రాజకీయాలన్నీ పొత్తులు చుట్టూనే తిరుగుతున్నాయి.2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న అన్ని అనుకూల పరిస్థితుల పైన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి.బిజెపి, జనసేన , వైసీపీ , టీడీపి లు ప్రధానంగా ఎన్నికల పైన దృష్టి సారించాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన టార్గెట్ గా ఏపీ లో రాజకీయాలు మొదలయ్యాయి.
ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధపడడం లేదు.బీజేపీ నేతలతో పాటు ఆ పార్టీ జాతీయ నాయకుల తీరు జనసేన కు ఆగ్రహం కలిగిస్తోంది.
బిజెపి వంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు కొత్తగా కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అనే విషయాన్ని ఇప్పుడు జనసేన కీలక నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పిస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జనసేన పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకున్నా… ఏపీ అధికార పార్టీ వైసిపి విషయంలో సానుకూలంగా ఉండటం ఆగ్రహం కలిగిస్తోంది.
ఏపీలో బీజేపీ నేతలు వైసీపీ పై విమర్శలు చేస్తున్న, అవి నామమాత్రమేనని జనసేన అనుమానిస్తోంది.కేంద్ర బిజెపి పెద్దలు జగన్ కు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండడం, జగన్ కోరిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ జనసేనకు అనుమానాలు కలిగిస్తూనే ఉన్నాయి.
బిజెపి నాయకులు వైసీపీ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా, అవి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే కుట్రలో భాగంగానే అనే అభిప్రాయం తో జనసైనికులు ఉన్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కంటే టీడీపీతో కలిసి వెళ్లడమే మంచిదనే అభిప్రాయం జనసేన వర్గాల్లో ఉండడంతో ఇప్పుడు బిజెపికి దూరమయ్యే ఎత్తుగడకు జనసేన శ్రీకారం చుట్టినట్టు గా కనిపిస్తోంది.
అందుకే ఒక్కసారిగా జనసేన కీలక నాయకులంతా బిజెపిపై విమర్శలు చేస్తూ.ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన కు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని.జనసేన – బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి ఎక్కువ లాభం ఉండదని అభిప్రాయాన్ని జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు.ఈ తరహా వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తాయని, పొత్తు రద్దు చేసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయనే అభిప్రాయం జనసేన కీలక నాయకుల్లో వ్యక్తం అవుతోంది.
అందుకే బీజేపీ టార్గెట్ గా జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.