పైకి చెప్పకపోయినా , జనసేన టిడిపి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తేనే ఏపీలో అధికారంలోకి రాగలమనే అభిప్రాయం రెండు పార్టీల అధినేతలలోను బలంగా ఉంది.అయితే ఈ పొత్తు ద్వారా పార్టీ శ్రేణుల్లో వచ్చే వ్యతిరేకతను ఏ విధంగా నివారించాలనే విషయంపైనే తర్జనభజన పడుతున్నారు.
ఇప్పటికే జనసేన , టిడిపి లు ఒకే తానులో ముక్కలని, చంద్రబాబు ఏం చెబితే పవన్ ఆ విధంగా వ్యవహరిస్తారని, చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడు అంటూ వైసీపీ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ద్వారా వైసీపీ చేసే విమర్శలకు బలం చేకూరుతుందనే భయం రెండు పార్టీల అధినేతల్లోనూ ఉంది.2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే పొత్తు తప్ప మరో మార్గం లేదని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
ఎన్నికల సమయానికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనలు ఉన్నాయి.
ఈ విషయంలో జనసేన కంటే టిడిపి అధినేత చంద్రబాబు ఎక్కువగా కంగారుపడుతున్నట్లు సమాచారం.రాబోయే ఎన్నికల నాటికి జనసేన టిడిపిలో పొత్తు పెట్టుకుంటాయన్న బలమైన నమ్మకంతో ఉన్న బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలు లేరు.ఒక్కో నియోజకవర్గానికి ఇన్చార్జిలను , పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు.
అన్ని నియోజకవర్గాలకు నియోజకవర్గ ఇన్చార్జీలను నియమిస్తే , జనసేనతో పొత్తు కుదిరే సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయని , ప్రస్తుతం ఇన్చార్జిలుగా నియమించిన వారు ఆ సీటును త్యాగం చేసేందుకు ఇష్టపడరు అని , దీనివల్ల ఎన్నికల్లో డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు జనసేనకు కేటాయించాలనుకున్న నియోజకవర్గాలకు తప్పించి, మిగతా అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించాలని నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు విజయవాడ పశ్చిమ , కైకలూరు, అవనిగడ్డ, భీమవరం, నరసాపురం , ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు , పోలవరం , చింతలపూడి , కాకినాడ రూరల్ , అమలాపురం, రాజోలు పి గన్నవరం భీమిలి, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జీలను నియమించకుండా జనసేనకు పొత్తులో భాగంగా ఈ సీట్లను కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.