బీజేపీ విషయంలో అనవసర మొహమాటాలు పక్కన పెట్టేయాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట.ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నా, ఎవరికి వారు విడివిడిగా రాజకీయాలు చేసుకోవడం, బీజేపీ పెద్దలు ఎవరూ తమను పట్టించుకోనట్టుగా వ్యవహరించడమే కాకుండా గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేనపై విమర్శలు చేయడం, కొద్ది రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటిషన్ డీకే అరుణ జనసేన తో తమకు పొత్తు లేదనే విషయాన్ని బహిరంగంగా చెప్పడం పవన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ఇక క్షేత్ర స్థాయిలోనూ బిజెపి, జనసేన పార్టీల మధ్య అంతగా సఖ్యత లేకపోవడం, క్షేత్రస్థాయిలో కలిసి పని చేసేందుకు జనసైనికులు ఇష్టపడకపోవడం వంటి ఎన్నో కారణాలతో బిజేపితో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేదనే అభిప్రాయానికి పవన్ వచ్చారట.
బీజేపీతో కలిసి వెళ్లేందుకు అంతగా ఇష్టం లేకపోవడంతోనే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో చాలా చోట్ల టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో జనసేన, బిజెపి చాలా చోట్ల కలిసి పోటీ చేస్తున్నాయి.అక్కడ బీజేపీ పరిస్థితి అయోమయంగా మారింది.క్షేత్ర స్థాయిలో బలం, బలగం లేని బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్లినా కలిగే ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటుందని, కేంద్ర పెద్దల సహకారం గురించి ఆలోచన తప్ప, క్షేత్రస్థాయిలో బీజేపీతో కలిసి నడవడం తమకు నష్టం అనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లు సమాచారం.అందుకే బిజెపితో కంటే తెలుగుదేశం పార్టీతో కలిసి నడిస్తేనే మంచిదనే ఆలోచనతోనే ముందుగా మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడా పొత్తు పెట్టుకుని, వాటి ఫలితాల ఆధారంగా బిజెపికి కటీఫ్ చెప్పి టీడీపీతో కలిసి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట.
అలాగే తిరుపతి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే విషయంలోనూ బిజెపి ఆదిపత్యం చెలాయించడం, జనసేన కు టికెట్ ఇచ్చేందుకు ఇష్టపడకపోవడం, కనీసం జాతీయ స్థాయి నాయకులు ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇలా ఎన్నో అంశాలతో బీజేపీపై ఆగ్రహంతో ఉన్న పవన్ ఇదే సరైన సమయం గా భావించి మరికొద్ది రోజుల్లోనే బహిరంగంగా ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక టీడీపీ సైతం జనసేన తో పొత్తు కోసం ఆశగా ఎదురుచూస్తోంది.త్వరలోనే ఆ ఆశ తీరేలా కనిపిస్తోంది.మరి కమలనాథుల రియాక్షన్ ఎలా ఉంటుందో ?
.