ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల స్థాయిలో జనసేన పార్టీ ఉన్నా, ఆ పార్టీని ఆ స్థాయిలో ముందుకు నడిపించలేక పోతున్నారు పవన్.ఏపీలో ప్రధాన సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
దీనికితోడు సినీ అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.ముఖ్యంగా యూత్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇలా అన్ని సానుకూల అంశాలు పవన్ కు ఉన్నా, రాజకీయంగా ఆయన పూర్తిగా వెనుకబడి పోయారు.2019 ఎన్నికల్లో నే పవన్ కనీసం 20 , 30 స్థానాల్లో విజయం సాధిస్తారని అంతా భావించినా, కేవలం ఆ పార్టీకి ఒకే ఒక్క సీటు దక్కడంతో ఇంతేనా అని అందరూ ఢీలా పడిపోయారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేకపోవడం, పవన్ వాయిస్ , పార్టీ విధి విధానాలు అన్ని జనాల్లోకి వెళ్ళకుండా ఉండిపోవడం వల్ల పవన్ కు ఇంత ఘోర ఓటమి ఎదురైంది అనేది పవన్ కు ఆ తరువాత అర్ధం అయ్యింది.ఎప్పటి నుంచో సొంతంగా ఒక పేపర్, ఒక టీవీ ఛానల్ పెట్టి జనసేన వాయిస్ జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో పవన్ ఉంటూ వస్తున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చాలా మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి.జగన్ కు అనుకూలంగా సాక్షి మీడియా ఉంది.కానీ పార్టీ తరుపున వాయిస్ వినిపించేందుకు ప్రత్యేకంగా ఒక ఛానల్ లేదనే అభిప్రాయం ఎప్పటి నుంచో పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
జనసేన కీలక నాయకుడి కి ఓ ఛానెల్ ఉంది.అందులో జనసేన వాయిస్ వినిపిస్తున్నా, ఆ ఛానల్ కు జనాల్లో సరైన ఆదరణ దక్కకపోవడంతో, ఇప్పుడు సొంతంగానే ఒక పత్రిక, ఒక ఛానల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆ రెండు మీడియా మార్గాల ద్వారా జనసేన పార్టీ విధివిధానాలను ఎప్పటికప్పుడు జనాల్లోకి తీసుకెళ్లి మరింత బలం పెంచుకోవాలనే విధంగా పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఛానల్ ,పేపర్ ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు సమాచారం.త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు పవన్ సర్వం సిద్ధం చేస్తున్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.