జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప త్యాగం చేశారు.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో జనసేన పార్టీనే పోటీ చేస్తుంది అంటూ పవన్ తో పాటు జనసైనికులు చెబుతూ, నమ్ముతూ వచ్చారు.
సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే జనసేన చెబుతూ వచ్చింది.అలాగే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక పర్యటనలు చేపట్టారు.
పూర్తిగా తిరుపతి లోక్ సభ సీటును దక్కించుకుంటాము అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే బిజెపి మాత్రం మొదటి నుంచి తిరుపతి లో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని చెబుతూ వస్తుంది.
అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గతంలోనే ఈ ప్రకటన చేశారు.ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభావం బీజేపీ కంటే ఎక్కువగా కనిపించడం, వంటి కారణాలతో తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడని ఆ పార్టీ నాయకులు పవన్ అభిమానులు భావిస్తూ వచ్చారు.
అయితే అనూహ్యంగా తిరుపతి లో బీజేపీ అభ్యర్థి పోటీ లో ఉంటాడు అనే విషయాన్ని బీజేపీ అధిష్టానం తేల్చి చెప్పేసింది.
అలాగే పవన్ సైతం పార్టీ నాయకులకు బహిరంగ సందేశం ఇచ్చారు.
పార్టీ భవిష్యత్తు దృష్ట్యా తిరుపతిలో బిజెపికి అవకాశం ఇస్తున్నామని, ఇది పార్టీ అంతర్గతంగా బలపడేందుకు చక్కటి అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, భవిష్యత్తులో జనసేన బలపడేందుకు ఇదో చక్కటి మార్గం అని, అందుకే ఈ త్యాగానికి పాల్పడుతున్నాము అంటూ పవన్ బహిరంగంగా లేఖ రాశారు.దీంతో మరోసారి పవన్ తీరు పై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
మొదటి నుంచి బిజెపి జనసేనను ఇదే విధంగా మభ్యపెడుతూ, తమకు అనుకూలంగా జనసేన ను ఉపయోగించుకుంటున్నా, పవన్ ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారని, ప్రతిసారి బిజెపి కోసం జనసేన మాత్రమే త్యాగం చేస్తోంది తప్ప జనసేన కోసం బిజెపి ఏ ప్రయత్నం చేయడం లేదని, కనీసం బిజెపి అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా పవన్ కు లభించడం లేదని, అయినా పవన్ మాత్రం బిజెపికి దూరం అయ్యేందుకు ఇష్టపడకుండా, త్యాగానికి అలవాటు పడ్డారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదట్లో పోరాటానికి దిగుతామని హడావుడి చేసినా, ఢిల్లీ పెద్దల ఆదేశాలతో సైలెంట్ అయిపోయారు.
దేశ సమగ్రత కోసం బిజెపి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పవన్ ప్రకటించేశారు.ఇలా ప్రతి దశలోనూ, పవన్ బిజెపి కోసం జనసేన రాజకీయ ఎదుగుదలను పణంగా పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.
అయితే ఇదంతా దేశం కోసం ధర్మం కోసం తప్పదు అనే సన్నాయి నొక్కులు జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.