ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని జనంలోకి వెళ్లేందుకు జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు మినీ మహానాడు నిర్వహిస్తున్నారు.
ఏపీ అధికార పార్టీ వైసీపీ సైతం గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజా ప్రతినిధులు, అధికారులు జనాల్లోకి వెళ్లే విధంగా ఇప్పటికే సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తోంది.అలాగే నియోజకవర్గాల వారీగా ప్లీనరీలూ నిర్వహిస్తోంది.
జనసేన సైతం ఇప్పుడు జనవాణి పేరుతో జనాలకు దగ్గరే అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఈ జనవాణి కార్యక్రమం ద్వారా వచ్చే ఐదు వారాలపాటు జనం నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారు.
ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటూ .బాధితుల పక్షాన వాటిని స్వీకరిస్తారు .ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని అధికారులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడంతో జనవాణి పేరుతో దీనిని హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేశారు.
జులై మూడో తేదీన విజయవాడలోని మాకినేని బసవ కొండయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం మూడు గంటల వరకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటారు .ప్రజల నుంచి స్వయంగా ఆయనే అర్జీలను స్వీకరిస్తారు.అక్కడే వాటికి జనసేన ప్రతినిధులు రసీదును కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు.
తొలి రెండు ఆదివారాలు ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.ఆ తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ,ఉభయగోదావరి జిల్లాలలోను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజల అర్జీలను జగన్ స్వీకరించలేదని, అలాగే జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా కొనసాగుతోందని , అలాగే ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదని, అందుకే జనవాణి పేరుతో జనం సమస్యలను తీర్చేందుకు పవన్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మనోహర్ తెలిపారు.