ఒక పక్క తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. కరోనా వైరస్ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
లాక్ డౌన్ నిబంధన కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ప్రభుత్వం చేస్తున్న సహాయం అంతంత మాత్రంగానే ఉందంటూ పదే పదే విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని మరింత కంగారు పెడుతూ ప్రజలకు సహాయం అందేలా తమవంతు ప్రయత్నాలు చేస్తోంది.దీనిపై వైసీపీ కూడా అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది.
కరోనా విషయాన్ని కూడా పక్కనపెట్టి వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి టిడిపిని విమర్శిస్తూనే, మరోవైపు జనసేన ను కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఒకపక్క లాక్ డౌన్ నిబంధన కారణంగా, రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక కరోనా టెస్ట్ ల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటోంది.అయితే ఈ సమయంలో రాజకీయంగా మైలేజ్ పెంచుకునే విధంగా జనసేన ప్రయత్నాలు చేయాల్సి ఉన్నా, తమకు ఎందుకు లే అన్నట్టుగా నిర్లక్ష్యం వహించడం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరుస్తుంది.
ఒకవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్నా, పగడ్బందీగా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న వెయ్యి రూపాయలు సరిపోవని, పనుల్లేక ఉపాధి కోల్పోయిన రైతులు కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై టిడిపి ఒత్తిడి చేస్తోంది.
ఈ డిమాండ్ పై ప్రజల నుంచి కూడా సానుకూల దృక్పథం ఏర్పడుతోంది.
మే మూడో తేదీ వరకు ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రజలు కూడా తమకు 5000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.అదే సమయంలో టిడిపి ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ పదే పదే కేంద్రానికి లేఖలు రాస్తూ హడావుడి చేస్తున్నారు.చంద్రబాబు రాస్తున్న లేఖలతో వైసీపీ ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొంటోంది.
మరింత సమర్థవంతంగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ విషయంలో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో ఎదురుదాడి జరుగుతున్నా, టిడిపి కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు గానీ, ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
అదే సమయంలో టీడీపీ కి మద్దతుగా నిలుస్తున్న లెఫ్ట్ పార్టీలు కూడా ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి.
లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే కార్మికుల సంక్షేమం నిమిత్తం 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
సీఎంకు నేరుగా లెఫ్ట్ పార్టీలు డిమాండ్లు చేస్తున్నాయి.వలస కార్మికులు ఆర్థిక సహాయం పై దృష్టి పెట్టాలని, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని, రైతులకు ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా ప్రయత్నించాలని, 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే వారికి ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు నిరంతరంగా ప్రభుత్వ పనితీరుని ఎండగడుతూ, ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుండగా జనసేన మాత్రం పూర్తిగా మౌనం వహిస్తోంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని తప్పు పడుతూ, ఆ తర్వాత సైలెంట్ అయిపోతుండడం జనసేన కార్యకర్తలు కూడా రుచించడం లేదు.కరోనా సమయంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు, తదితర విషయాలపై జనసేన మిగతా పార్టీలు, పోరాటం చేస్తే మైలేజ్ దక్కుతుందని, ప్రజల్లో కూడా గుర్తింపు సంపాదించవచ్చని, కానీ అలా మౌనంగా ఉండడం వల్ల క్రెడిట్ మొత్తం తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు తన్నుకుపోతాయని, ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.కనీసం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగకపోయినా, పార్టీ నేతల ద్వారా అయినా, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీకి చెందిన నాయకులు కోరుతున్నారు.