పవర్ స్టార్ గానే కాకుండా జనసేన అధినేతగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న పేరు ప్రఖ్యాతలు మరి ఏ హీరోకి లేవనే చెప్పవచ్చు.పవన్ సినిమాల్లో నటిస్తున్న, నటించకపోయినా, రాజకీయంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఆయన అభిమానులు మాత్రం ఎక్కడ చెక్కుచెదరలేదు.
పవన్ వెన్నంటే నడుస్తూ, ఆయన మాట తమ బాటగా చేసుకుంటూ వస్తున్నారు.నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని కొద్ది రోజులు ముందు నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.
కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, పవన్ కు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారు.ఇదంతా ఇలా ఉంటే, పవన్ చాలాకాలంగా రాజకీయంగా వెనుకబడిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జనసేనను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విఫలమవుతున్నారని, పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టకుండా, తనకు తోచినప్పుడు మాత్రమే వివిధ సమస్యలపై స్పందిస్తూ, తర్వాత సైలెంట్ అయిపోతున్నారు అనే ఎన్నో విమర్శలు ఆయనపై ఉన్నాయి.ఇక రాజకీయంగా జనసేనను మరింతగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, పెద్దగా ఉపయోగం లేకపోవడం, ఆ పార్టీ జనసేన ను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ, తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఈ పరిణామాలతో జనసేన బీజేపీ పొత్తు పై అనేక అనుమానాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో జనసేన కు రాజకీయంగా మరింత ఊపు తీసుకువచ్చే విధంగా చేయాలని, తమతో బిజెపి కలిసి వచ్చినా, రాకపోయినా, తనకున్న అభిమానులు, కార్యకర్తల ద్వారానే పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని, ఇకపై నిత్యం ప్రజా సేవ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు పాలు పంచుకునేలా చేసి, 2024 నాటికి బలపడాలని పవన్ నిశ్చయించుకున్నారట.ఇక తన పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలే ఈ తరహా ఆలోచనకు నాంది పలికేలా చేసిందట.
అందుకే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తూ, జనసేనను జనాల్లోకి తీసుకువెళ్లే విషయంపై దృష్టి పెట్టాలని, తనపై పడిన కుల ముద్ర పడకుండా, అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించే విధంగా జనసేనను ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.