ఏపీలో అధికారం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు కులాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నాయి.ప్రధానంగా బిసి ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ వైసీపీ జనసేన పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఆయా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడం ద్వారా… సులువుగా అధికారం దక్కించుకోవచ్చనే భావనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ విధంగానే గత నెలలో బీసీల పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తూ…టీడీపీ జయహో బీసీ అంటూ సభ నిర్వహించి అనేక వాగ్దానాలు చేసింది.
దీనికి కౌంటర్ గా అన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏలూరులో బీసీ సభను నిర్వహించి ఆ సామాజిక వర్గాలకు వరాల జల్లు కురిపించారు.
ఈ రెండు పార్టీలు బీసీలను ఆకట్టుకునే పనిలో ఉండడంతో జనసేన పార్టీ ఈ విషయం లో వెనకబడిపోయినట్టు భావిస్తోంది.అందుకే… ఇప్పుడు ఈ రెండు పార్టీలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు జనసేన ప్రయత్నిస్తోంది.అందుకే ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన ఇప్పుడు తెరమీదకు తెస్తోంది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బీసీలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చారని , మెజార్టీ స్థాయిలో బీసీలకు సీట్లు కేటాయించారని… కానీ చిరంజీవిలా… ఎప్పటికీ ఎవరు బీసీలకు సీట్లు కేటాయించలేకపోతున్నారని గుర్తు చేస్తున్నారు.
చిరంజీవి బీసీ సామాజికవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు వైసిపి, టిడిపి ఇవ్వగలవా అంటూ… ప్రశ్నిస్తున్నారు.
ప్రజారాజ్యంలో అప్పట్లో పోటీ చేసిన వారిలో సుమారు వందమందికి పైగా కొత్త ముఖాలే .చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఉమ్మడి రాష్ట్రాలలో బీసీలకు ఎక్కడలేని ప్రాధాన్యం కల్పించారని ….కానీ వైసిపి టిడిపి లో కేవలం రెండు సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని వారికి బీసీలపై ప్రేమ లేదని కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని జనసేన విమర్శిస్తోంది.
బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం కంటే… సీట్లు ఇచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసురుతున్నారు.అయితే జనసేన విమర్శలను టీడీపీ వైసీపీ లు పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా అసలు ఇప్పడు ఉన్నట్టుండి ప్రజారాజ్యం… చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం వెనుక ఏదైనా ప్రాధాన్యం ఉందా…? అనే కోణంలో ఆ రెండు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.అంటే చిరంజీవి జనసేన తరపున ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారా …? జనసేనకు మద్దతుగా ప్రచారానికి వచ్చేందుకు సిద్ధపడుతున్నారా …? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం జనసేన పార్టీలో టిక్కెట్లు ఆశిస్తున్నా వారిలో చాలామంది కొత్తవారే.ఇక టీడీపీ వైసీపీ లకు విసిరిన సవాల్ ను జనసేన పార్టీ ఆచరిస్తుందా …? లేదా అనేది చూడాలి.