ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది టిడిపి ఎమ్మెల్యేలతో పాటు, జనసేన కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వంటి వారు బయట నుంచి వైసీపీకి మద్దతు పలికారు.నేరుగా వైసిపి లో చేరితే అనర్హత వేటు పడుతుందనే భయంతో వారు తాము గెలిచిన పార్టీలోనే ఉంటూ జగన్ కు జై కొడుతూ వస్తున్నారు.
ముఖ్యంగా జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ బహిరంగంగానే జగన్ కు మద్దతు పలుకుతూ, ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు నిర్వహించారు.రాజోలు నియోజకవర్గంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యే గానే చలామణి అవుతున్నారు .జనసేన తనను సస్పెండ్ చేస్తుందని , అప్పుడు దర్జాగా వైసీపీలో చేరవచ్చని చాలాకాలం నుంచి చూస్తున్నా, జనసేన మాత్రం ఆయనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.అయితే ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు వ్యతిరేకంగా వైసిపి జనగ్రహ దీక్ష చేపట్టింది.
ఆ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ కండువా కప్పుకోవడం పెద్ద సంచలనంగా మారింది.జగన్ పై టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వైసిపి ఇచ్చిన జనాగ్రహ దీక్ష రాజోలు నియోజకవర్గం లోని జరిగింది.
ఈ దీక్షకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన వైసిపి కండువాలు కప్పుకుని ప్రసంగించారు.సరిగ్గా అదే సమయంలో మీడియా ప్రతినిధులు అక్కడకు రావడం తో వెంటనే మెడలో కండువా ఆయన తీసేసారు.అయితే అప్పటికే దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జనసేనకు రాజీనామా చేయకుండా ఈ విధంగా ఆయన వైసీపీ జెండా కప్పుకోవడం, ముందు ముందు అనేక సందర్భాల్లో ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.ఇప్పటికే రాపాక వరప్రసాద్ వ్యవహారశైలిపై రాజోలు నియోజకవర్గం జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.తమ పార్టీ నుంచి గెలిచిన రాపాక జగన్ కు జై కొట్టడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.పార్టీ అభ్యర్థులు ఓటమి చెందినా, సమిష్టి కృషితో రాపాక వరప్రసాద్ ను గెలిపించాము అని, ఆయన మాత్రం స్వార్దం చూసుకున్నారు అంటూ పదేపదే రాజోలు జనసైనికులు విమర్శలు చేస్తూనే వస్తున్నారు.