జనసేన నుంచి పోటీ చేసిన వారంతా ఓటమి చెందినా, చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయంపాలైనా, ఆ పార్టీ పరువు ప్రతిష్టలు కాపాడేందుకు అన్నట్టుగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గెలుపొందారు.కానీ ఆ గెలిచిన సందడి వాతావరణం ఇంకా తగ్గక ముందే అకస్మాత్తుగా రాపాక వరప్రసాద్ వైకిరిలో మార్పు రావడం , జగన్ కు జై కొట్టడం వంటివి జరిగిపోయాయి.కానీ జనసేన పార్టీని ఆయన వీడలేదు.పోనీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడని ఆయనను జనసేన సస్పెండ్ కూడా చేయలేదు.అసలు పట్టించుకోవడమే మానేశారు.కానీ రాపాక మాత్రం జనసేన ఎమ్మెల్యే గా చలామణి అవుతూ, కండువా కప్పుకోకుండానే వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు.
ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ, జనసేనకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నారు.రాపాకను జనసేన అధిష్టానం లైట్ తీసుకున్నా, పవన్ అభిమానులు, జనసైనికులు వదిలిపెట్టడంలేదు.
రేపాకకు వ్యతిరేకంగా రాజోలు లో జనసైనికులు రాజకీయం చేస్తున్నారు.అడుగడుగునా అడ్డుతగులుతూ వస్తున్నారు.
పోనీ వైసీపీ రాజోలు నాయకులు ఏమైనా రాపాకకు మంగళ హారతులు పడుతున్నారా అంటే అబ్బే అటువంటిది ఏమీ లేదు.ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టేశారు.
దీంతో అటు ఆ పార్టీ …ఇటు ఈ పార్టీ ఆదరణ లేక ట్రబుల్ అయిపోతున్నారు.కేవలం జగన్ దగ్గర పలుకుబడి తప్ప ఇక రాపాకకు ఏదీ కలిసి రావడంలేదు.దీనికి తోడు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ రాపాకకు ఎదురుదెబ్బ తగిలింది.రాజోలు నియోజకవర్గంలో మొత్తం 15 పంచాయతీలను జనసైనికులు గెలిపించుకుని రాపాకకు సవాల్ విసిరారు.అటు వైసీపీ.ఇటు జనసేన ఏ పార్టీ మద్దతు తనకు లభించక ఏకాకి అయిపోయాడట ఈ ఏకైక జనసేన ఎమ్మెల్యే.