అధికార పార్టీ అంటే ఆషామాషీ ఏమి కాదు.ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఆ పార్టీలోని నాయకులు, ఎమ్మెల్యేల హడావుడి ఉంటుంది.
అందుకే ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు కూడా, అధికార పార్టీకి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.అసలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికార పార్టీలోకి వలసలు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి.
కొంతమంది అధికారికంగా అధికార పార్టీలో చేరకుండానే, అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ, గెలిచిన పార్టీకి ఝలక్ ఇస్తుంటారు.ఆ విధంగానే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహరిస్తూ వస్తున్నారు.
వైసీపీలో ఆయన చేరకపోయినా, వైసీపీ నాయకులను మించి మరీ జగన్ ను, ప్రభుత్వాన్ని పొగుడుతూ పదేపదే ఆయన మాట్లాడుతుండటం జనసేన వర్గాలకు మొదట్లో ఆగ్రహం తెప్పించినా, ఆ తరువాత ఆయన వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా, ఆ పార్టీ వ్యవహరిస్తోందని, ఇదే అదునుగా వైసీపీలో తన పట్టు పెంచుకునేందుకు రాపాక మెల్లి మెల్లిగా అడుగులు వేస్తూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది.
జగన్ కూడా రాపాక విషయంలో సానుకూలంగా ఉండడంతో, ఆయన మరింతగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఈ వ్యవహారం రాజోలు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది.అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్యే లాగే వ్యవహరిస్తున్నారు.
ఇదే ఇప్పుడు రాజోలు వైసీపీ లో వంటలు పుట్టిస్తోంది.ఇప్పటికే అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు, ప్రస్తుత ఇంచార్జి అమ్మాజీ రెండు వర్గాలుగా ఉన్నారు.వీరిద్దరూ ఆధిపత్యం కోసం కొంతకాలంగా హడావిడి చేస్తుండగా, ఇప్పుడు ఆకస్మాత్తుగా రాపాక వరప్రసాద్ అక్కడ వైసీపీలో మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ, మెల్లిమెల్లిగా పార్టీపై పట్టు పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
తాను మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతోనే జనసేన నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని, తాను వైసీపీ తోని కలిసి నడుస్తానని రాపాక చెబుతున్నాడు.జగన్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పుకుంటూనే ఆ పార్టీలో మిగతా రెండు గ్రూపులకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.దీని కోసమే కాస్త దూకుడుగా వ్యవహరిస్తుండడంతో వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.ప్రస్తుతం ఈ వ్యవహారం రాజోలు నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.ప్రస్తుతం ఇక్కడ వైసిపి మూడు గ్రూపులుగా ఉండడంతో ఎవరు ఎవరితో కలిసి నడవాలో తెలియని అయోమయంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.
ఈ వ్యవహారం ఇలాగే వదిలేస్తే, పూర్తిస్థాయిలో పార్టీ దెబ్బతటుందని, అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాలని, లేకపోతే మూడు గ్రూపుల మధ్య పార్టీ మూడు ముక్కలు అవుతుందని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
రాపాక మాత్రం తాను ఎక్కడా తగ్గేది లేదు అన్నట్టుగా హడావుడి చేస్తుండడంతో, ముందు ముందు ఇక్కడ వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి జగన్ కు తల నొప్పులు తీసుకురావడం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.