జనసేన పార్టీ ఏపీలో ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులకి అండగా నిలబడి ఉద్యమం చేస్తున్నారు.దీనికి పవన్ కళ్యాణ్ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు.
అయితే ఇప్పటికే జనసేన పార్టీ స్టాండ్ కి విరుద్ధంగా సొంత అజెండాతో అధికార పార్టీకి సపోర్ట్ ఇస్తూ వెళ్తున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు జనసేన పార్టీకి పూర్తిగా దూరం అయ్యాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది.ఇక జనసేన పార్టీ కూడా రాపాకని పూర్తిగా పక్కన పెట్టిందా అంటే అవుననే మాట బలంగా వినిపిస్తుంది.
తాజాగా విజయవాడలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యాచరణ మీద నాయకులందరూ కలిసి చర్చించారు.
ఇక ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి కూడా రావాలని మెసేజ్ వెళ్ళిన కూడా ఆయన ఈ సమావేశానికి డుమ్మా కొట్టి ఏకంగా గుడివాడలో వైసేపీ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందేలు పోటీలని తిలకించడానికి వెళ్ళాడు.పార్టీ సమావేశంతో తనకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగానే ఇక్కడ రాపాక మీడియాతో మాట్లాడటం విశేషం.
ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో తన స్టాండ్ ప్రకారమే వెళ్తానని స్పష్టం చేసేసాడు.ఇక జనసేన పార్టీ అధిష్టానంతో తనకి ఎలాంటి సంప్రదింపులు ఉండవని, పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్న ప్రభుత్వం మంచి చేస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని తెలియజేశాడు.
అయితే రాపాక వ్యాఖ్యల మీద గాని, ఈ సమావేశానికి డుమ్మా కొట్టడంపైన గాని జనసేన పార్టీ నేతలలో ఏ ఒక్కరు కూడా అధికారికంగా స్పందించలేదు.ఇదంతా కేవలం అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు సైలెంట్ గా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
రాపాక పార్టీ స్టాండ్ కి విరుద్ధంగా వెళ్ళడం జనసేన పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.