జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం పెద్ద త్యాగం చేశారు.గ్రేటర్ లో ఆ పార్టీని గెలిపించేందుకు జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ముందుగా ప్రకటించినా, ఆ తర్వాత బీజేపీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు.
బిజెపి విజయం కోసం జనసైనికులు అందరూ కృషి చేయాలని పవన్ పార్టీ శ్రేణులను కోరారు.ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారుతుంది అని, రాజకీయవర్గాల్లో విమర్శల పాలు అవుతామని పవన్ కు తెలిసినా, బీజేపీ కోసం త్యాగం చేసేందుకు ముందుకు వచ్చారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా , బీజేపీ అవసరం ఎంతో ఉంది అని పవన్ అభిప్రాయపడడంతోనే ఈ విధంగా వ్యవహరించారు.ఒకరకంగా ఈ వ్యవహారంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే.
ఇదిలా ఉంటే పవన్ చేసిన త్యాగాన్ని తెలంగాణ బిజెపి నాయకులు కొంతమంది సరిగా అర్థం చేసుకో నట్టుగా వ్యవహరించారు.ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జనసేన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన పై చులకన భావనతో వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.జనసేన తో పొత్తు గిత్తు లేదని, అసలు తెలంగాణలో బిజెపికి ఎవరితోనూ పొత్తు లేదని అన్నారు అక్కడితో ఆగకుండా తాము వెళ్లి పవన్ కళ్యాణ్ మద్దతు అడగలేదని, ఆయనే బిజెపికి సంఘీభావం ప్రకటించారని చెప్పడంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.
జనసేన ను అవమానించే విధంగా అరవింద్ ఈ విధంగా వ్యాఖ్యానించడం జనసేన వర్గాలను బాధించాయి.
అయితే ఈ వ్యాఖ్యలు చేసింది బిజెపి ఎంపీ కావడంతో ఆచితూచి మరీ స్పందించారు.అరవింద్ వ్యాఖ్యలు పవన్ ను బాధించాయని, వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బిజెపి నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు వచ్చి కోరితేనే, తాము పోటీ నుంచి పక్కకు తప్పుకున్నాము అని జనసేన ప్రెస్ నోట్ విడుదల చేసింది.ఈ మేరకు జనసేన తెలంగాణ విభాగం చూస్తున్న శంకర్ గౌడ్ ప్రెస్ నోట్ విడుదల చేసి అరవింద్ >వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు.
అయితే ఈ వ్యవహారం జనసేన వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీజేపీ అభిప్రాయమా అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్నికల సమయంలో పెద్ద వివాదంగా మారింది.