ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ ఆ అంశంపై ఊహాగానాలకు అయితే కొదవేలేదు.ఏ పార్టీకి చెందినవారు ఆ పార్టీకి అనుకూలంగా రిజల్ట్స్ ఉండబోతున్నాయి అంటూ ప్రచారం చేసేస్తూ సామాన్యులను గందరగోళానికి గురిచేస్తున్నారు.
ఈ సందడి సరిపోదన్నట్టు ఎగ్జిట్ పోల్స్ బయటకి వచ్చాయి.ఇందులో లగడపాటి రాజగోపాల్ సర్వే టీడీపీకి అనుకూలంగా వస్తే, ఇండియా టుడే సర్వే వైసీపీకి అనుకూలంగా వచ్చింది.
దీంతో జనాల్లో కన్ఫ్యూజన్ కాస్తా మరింత పెరిగింది.ఇది చాలదన్నట్టు ఇప్పుడు జోతిష్యులు కొంతమంది కేంద్రంలోనూ, ఏపీలోనూ హంగ్ తప్పదంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
వీరి లెక్కల ప్రకారం ఏపీలో ఎవరూ సొంతంగా అధికారం చేపట్టలేరని చెబుతున్నారు.
ఇప్పటివరకు వచ్చిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ పూర్తి అవాస్తవాలని, వాస్తవాన్ని వారు మరుగునపడేస్తున్నారని చెబుతున్నారు ఢిల్లీలో జ్యోతిష్య శాస్త్రంలో గోల్డ్ మెడల్ కొట్టిన శైలేంద్ర శర్మ.ఏప్రిల్ 11 నుంచీ మే 19 వరకూ ఎన్నికలు జరిగిన 7 దశలూ చూస్తే… గ్రహాలు ఏ పార్టీకీ అనుకూలంగా లేవని ఆయన చెబుతున్నారు.కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా సరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని తేల్చిచెబుతున్నారు.
అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్కి ప్రధాని అయ్యే భాగ్యం లేదట.ఎన్డీయే పక్షాలన్నీ కలిసినా మేజిక్ ఫిగర్ (272) రాదని చెబుతున్నారు.
ఇక ఇప్పటివరకు ఏపీలో జనసేన ప్రభావమే ఉండదని అన్ని సర్వేల్లోనూ తేలడంతో ఆ పార్టీని ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు.అయితే జోతిష్యులు మాత్రం జనసేన అందరూ అనుకున్నంత బలహీనంగా ఏమీ లేదని, ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా జనసేన మద్దతు తప్పనిసరి అంటూ తేల్చేస్తున్నారు.జనసేన దాదాపు 70 అసెంబ్లీ స్థానాలపై తన ప్రభావం చూపించగలదంటున్నారు జ్యోతిష్యులు.ఆ 70లో ప్రతీ అసెంబ్లీ స్థానంలో 40 నుంచీ 90 వేల మంది కాపులు ఉన్నారనీ వీరిలో మెజార్టీ ఓటింగ్ జనసేనకు పడిందని చెబుతున్నారు.
వీరు చెప్పేది నిజమో కాదో రేపటి వరకు ఆగితే కానీ తెలియదు.