బీజేపీ ఆశలు అన్నీ ఏపీలో అడియాశలు అయ్యాయి.జాతీయ పార్టీగా బిజెపి ఏపీలో పట్టు సంపాదించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించి పార్టీని పరుగులు పెట్టించినా, గతంతో పోలిస్తే ఏపీలో బాగా బలం పెంచుకున్నట్టే కనిపించినా, జనసేన సహకారంతో అధికారం దక్కించుకోవాలని తాపత్రయ పడినా, బీజేపీ కి మాత్రం ఆ అవకాశం దక్కలేదు దక్కేలా కనిపించడం లేదు.ప్రస్తుతం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఏపీలో ఏ మాత్రం ఆదరణ పెరగలేదు అనే విషయాన్ని రుజువు చేశాయి.
బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపించక పోవడంతో, కనీస ఫలితాలను కూడా దక్కించుకోలేక చతికిలబడింది.అసలు బిజెపితో పోల్చుకుంటే, అతిచిన్న పార్టీగా ఉన్న జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలోనూ, అలాగే తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లోనూ, కాస్తో కూస్తో ప్రభావం చూపించగలిగినా, బీజేపీ తో పోల్చి చూసుకుంటే జనసేనే బెటర్ అన్నట్లుగా కనిపిస్తోంది.
అసలు ఏపీలో జనసేన పార్టీ తో కలిసి ఈ ఎన్నికలకు వెళ్లి సక్సెస్ అవ్వాలనేది బిజెపి ప్లాన్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోనూ, జనసేన బీజేపీ కూటమి కలిసికట్టుగా పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి.
కానీ జనసేన, బిజెపి అడుగడుగున అనుమానాస్పదంగా వ్వహరిస్తూ, ఆ పార్టీని దూరం చేసుకుంటున్నట్టుగా వ్యవహరిస్తోంది.గ్రామ స్థాయిలో బిజెపికి ఓటు బ్యాంక్ లేకపోయినా, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఉంది.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అక్కడ కూడా బీజేపీకి ఆదరణ లేదు అనే విషయం తేలిపోయింది.దీనికి తోడు క్రమంగా బిజెపి గ్రాఫ్ తగ్గడం, పెట్రోల్, డీజిల్ తో పాటు, నిత్యావసరాల ధరలు పెరగడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బిజెపి సిద్ధమవడం, ఇలా ఎన్నెన్నో జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బిజెపి గ్రాఫ్ మరింతగా తగ్గిస్తూ వస్తున్నాయి.
గత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కంటే సోము వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ బాగా బలపడిందని, అధికారం దక్కించుకునే అంత స్థాయికి వెళుతుందని అంత మొదట్లో ఊహించుకున్నారు.కానీ, కన్నా లక్ష్మీనారాయణ అయినా, సోము వీర్రాజు అయినా, మరొకరు అయినా, ఏపీ బీజేపీకి మాత్రం ఆదరణ ఉండదు అన్నట్లుగానే పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలుగా వైసీపీ, టీడీపిల సరసన జనసేన చేరుతోంది తప్ప, బీజేపీ కి మాత్రం ఛాన్స్ కనిపించడం లేదు.మరి ఈ పరిస్థితిని మార్చేందుకు సోము ఏ మాత్రం వేస్తారో ?
.