ఏపీలో జనసేన ను యాక్టివ్ చేసేసారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .మొన్నటి వరకు చెప్పుకోవడానికి పార్టీ తప్ప పెద్దగా కార్యకలాపాలు ఏవి ఉండేవి కాదు.
పార్టీ స్థాపించి ఏడేళ్లు అవుతున్నా, పార్టీని పవన్ బలోపేతం చేయలేకపోయారనే విమర్శలు ఎదుర్కొనేవారు. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసినా, కేవలం ఒక స్థానం తో మాత్రమే సరిపెట్టుకోవలసి వచ్చింది.
బిజెపితో జనసేన పొత్తు పెట్టుకుంది.అయినా ఎవరికి వారు విడివిడిగా రాజకీయ వ్యవహారాలు చేపట్టడంతో, రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనే అనుమానాలు అందరికీ ఉండగానే, గత కొద్ది రోజులుగా జనసేన జనాల్లోకి తీసుకెళ్లే విధంగా పవన్ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో టిడిపి ప్రభావం తగినట్టుగానే కనిపిస్తుంది.ఆస్థానంలో జనసేన యాక్టివ్ అయ్యి, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ జనాలు చర్చ జరిగేలా చేస్తుంది.ఈ దూకుడు ఇలా ఉండగా నే ఇప్పుడు తెలంగాణ పైన పవన్ ఫోకస్ పెట్టారు.అక్కడ పేరు కు పార్టీ తప్ప, ఏ రాజకీయ కార్యకలాపాలు చేపట్టడం లేదు.
అలాగే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేయడం లేదు.అయితే ఇకపై ఆ పరిస్థితిని మార్చేందుకు పవన్ సిద్ధమయ్యారు.
దీనిలో భాగంగానే ఈనెల 9వ తేదీన హైదరాబాద్ జనసేన తెలంగాణ శాఖ సమావేశం కానుంది.దీనికి ముఖ్య నేతలంతా హాజరు కావలసిందిగా ఇప్పటికే అనేక మంది కార్యకర్తలకు ఆహ్వానాలు అందాయి .
హైదరాబాద్ లోని జి పి ఎల్ కన్వెన్షన్ లో 9వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ కమిటీల నియామకం వంటివి చేపట్టనున్నారు. కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.అయితే ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు జనసేన మద్దతు ప్రకటించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారా లేక నిజంగానే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విషయం దృష్టి పెట్టారా అనేది ఈ నెల 9 వ తేదీన క్లారిటీ రాబోతోంది.