తిరుపతి లో మొదటి నుంచి తిరుపతి ఉప ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన పార్టీ ప్రయత్నాలు చేసింది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, వివిధ పర్యటనలు చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వ లోపాలు అన్నిటి పైనా విమర్శలు చేస్తూ, తిరుపతిలో జనసేన అభ్యర్థి విజయానికి ఢోకా లేకుండా చూసుకోవాలని ప్రయత్నించారు.కానీ అకస్మాత్తుగా బీజేపీ, జనసేన కు షాక్ ఇచ్చింది.
తిరుపతి లో బీజేపీ అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారని , దీనికి జనసేన మద్దతు ఇస్తుందని ప్రకటించారు.దీనిపై కొద్దిరోజుల పాటు పవన్ ఆగ్రహంగా ఉన్నా, చివరికి బీజేపీ నిర్ణయానికి ఓకే చెప్పారు.
దీనిపై జనసైనికుల్లో తీవ్ర అసహనం కనిపించింది.అయితే జనసేన తిరుపతి లో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ కు టికెట్ ఇచ్చి గెలిపించాలని చూసింది.
కానీ అవకాశం దక్కలేదు.
ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
టిడిపి నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ని, వైసీపీ డాక్టర్ గురుమూర్తి ని పోటీకి దింపాయి.బీజేపీ అనూహ్యంగా జనసేన అభ్యర్థిని ప్రకటించాలి అనుకున్న, మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
వాస్తవంగా రత్న ప్రభను జనసేనలో చేర్చుకుని, ఆమెకు టికెట్ ఇవ్వాలని పవన్ చూసినా, చివరకు బీజేపీ తరఫున ఆమె పోటీకి దిగడంతో, పవన్ సైతం సంతృప్తిగా ఉన్నారట.అయితే బీజేపీ పెద్దలు మాత్రం పవన్ తో వ్యవహారం చెడకుండా, పవన్ ను పోటీకి దింపాలి అనుకున్న రత్న ప్రభకే సీటు ఇచ్చి తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది.
ఇక్కడ ప్రత్యక్షంగా జనసేన పోటీకి దిగక పోయినా, తాము ఎంపిక చేసిన అభ్యర్థి ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం తో ఈ విధంగా అయినా బీజేపీ పై తమ మాట దక్కించుకుని విజయం సాధించాము అనే ఫీలింగ్ లో ఉందట.ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగిన రత్నప్రభ విజయావకాశాలపై చర్చ జరుగుతోంది .ఏపీలో వైసీపీ ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది.కేంద్రం అన్ని విషయాల్లో ఏపీకి అన్యాయం చేసిందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా , ఆంధ్రాకే తలమానకంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు మొగ్గు చూపించడం, పెట్రోల్, డీజిల్ , గ్యాస్ పెరుగుదల, దేశ వ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, తగ్గుతున్న మోదీ గ్రాఫ్ ఇలా ఎన్నో ఎన్నెన్నో అంశాలు తిరుపతిలో బీజేపీ అవకాశాలను దెబ్బతీసేవిగా కనిపిస్తున్నాయి.
ఇవన్నీ బీజేపీ, జనసేన లో ఆందోళన కలిగించే అంశాలే.