బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని భావన జనసేన పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.పొత్తు పెట్టుకున్నామన్న ఆనందం కొద్ది రోజులు కూడా జనసేన పార్టీ నాయకుల్లోనూ, పవన్ లోనూ నిలవడంలేదు.
అసలు జనసేన ను ట్రాప్ చేసేందుకు బీజేపీ తమతో పొత్తు పేరుతో నాటకాలాడి ఇలా చేస్తోందనే అనుమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కలుగుతోంది.తాను హడావిడిగా ఢిల్లీకి వెళ్లి మరి బిజెపి పెద్దల కోరిక మేరకు పొత్తు పెట్టుకున్నా ఆ తరువాత కనీసం తనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు ఎవరు ఇష్టపడకపోవడంతో మొదట్లోనే పవన్ కు బీజేపీ పై సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి బిజెపి అగ్రనేతలను కలిసి ఏపీ రాజకీయాల పై చర్చించాలని పవన్ చూసారు.అయినా వారి అపాయింట్మెంట్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పవన్ కు దొరకలేదు.
ఇక ఆ తర్వాత గతంలో ఇచ్చిన హామీ మేరకు విజయవాడ లో బీజేపీతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహించాలని చూశారు.అయితే దీనికి సంబంధించి తేదీని ప్రకటించిన తర్వాత బిజెపి ఈ లాంగ్ మార్చ్ ను వాయిదా వేయించింది.దీని పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఇదిలా ఉండగానే పవన్ కు బద్ధశత్రువుగా ఉన్న జగన్ ఢిల్లీకి పిలిపించి మరీ మీరు తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించడం, ముఖ్యంగా తాను వ్యతిరేకిస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదనకు బిజెపి అంగీకారం తెలపడం, ఈ విషయంలో తనకు కనీసం మాట వరసకైనా చెప్పక పోవడం ఇవన్నీ పవన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
తమతో పొత్తు పేరుతో నాటకమాడి బిజెపి పెద్దలు ఈ విధంగా వ్యవహరించడంపై పవన్ తన సన్నిహితుల వద్ద మండిపడుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు ఏపీలో తాను ఏ పోరాటం చేయాలన్నా బిజెపి అనుమతి కావాల్సి రావడం, అదే సమయంలో జగన్ కు మద్దతుగా, పవన్ కు వ్యతిరేకంగా బిజెపి అగ్ర నేతలు వ్యవహరిస్తుండడం ఇవన్నీ పవన్ కు ఇబ్బందికరంగా మారాయి.
అది కాకుండా మరికొద్ది రోజుల్లో కేంద్ర క్యాబినెట్ లో వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు రాబోతుండడంతో, ఇకపై తాను వైసిపి కి మద్దతుగా నిలబడాల్స వస్తుందనే ఆందోళన పవన్ లో కనిపిస్తోంది.
అదే జరిగితే ఏపీలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా భవిష్యత్తులో జనసేన పార్టీకి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న పవన్ బీజేపీతో తెగతెంపులు విడిగా ప్రజా పోరాటాలు చేస్తే తన రాజకీయ పలుకుబడిని పెరుగుతుందనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు మరికొద్ది రోజుల్లో బిజెపితో తెగదెంపులు చేసుకునే విషయమై పవన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది.అదే జరిగితే రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
.