రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న తరువాత లాభం అయిన, నష్టం అయిన, ఒకరి కోసం ఒకరు ఏదో ఒక చోట త్యాగం చేయాల్సి ఉంటుంది.అటువంటి త్యాగాలు ఎన్నో ఇప్పటికీ జనసేన పార్టీ బీజేపీ కోసం చేసింది.
తెలంగాణలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ కోసం జనసేన తప్పుకొని త్యాగం చేసింది.అలాగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో మొదటి నుంచి జనసేన పోటీ చేయాలని చూసింది.
కానీ మళ్లీ బీజేపీ కోసం మరోసారి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇలా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన, బీజేపీ కోసం జనసేన త్యాగం చేయాల్సి వస్తోంది తప్ప , జనసేన కోసం బీజేపీ ఎటువంటి త్యాగానికి సిద్ధం అవ్వడం లేదని, రాజకీయం చేయాలని చూస్తోందని జనసైనికులు ఇప్పటికే మంచి ఫైర్ మీద ఉన్నారు.
ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది.ఇది ఎలా ఉంటే తెలంగాణలో జరగబోతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ పోటీకి దిగుతుందని అందరూ అంచనా వేయగా, అక్కడ జనసేన అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధం అయ్యిందట.
దీంతో జనసేన అభ్యర్థి ఇక్కడ నామినేషన్ వేసే అవకాశం కనిపిస్తోంది.అసలు బీజేపీ తో సంబంధం లేకుండా జనసేన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టింది.దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించారు.ఇప్పటికే ఒక అభ్యర్థిని ఫైనల్ చేసింది.
అలాగే బీజేపీతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా నాగార్జునసాగర్ లో జనసేన అప్పుడే ప్రచారం నిర్వహించుకుంటూ, ముందుకు వెళుతుండటంతో, పరిస్థితి చేయి దాటి పోయే లా ఉందని , అది కాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగో స్థానం దక్కడం, జనసేన టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వంటి కారణాలతో బీజేపీ తెలంగాణ నాయకులు జనసేనకు నాగార్జునసాగర్ టికెట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారట.
ఇక్కడ బీజేపీ అభ్యర్థిని పోటీకి పెట్టినా, అక్కడ ఫలితం తేడా కొడితే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అని బీజేపీ భయపడుతోంది.అందుకే ఇక్కడి నుంచి జనసేన అభ్యర్ధినే పోటీకి దింపేందుకు బీజేపీ తెలంగాణ నేతలు సిద్ధమయ్యారట.