జనసేన పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అందరిని గందరగోళంలో పడేస్తున్నాయి.ఒక వైపు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు జనసేన ఒంటరి పోరాటమే చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ చెబుతున్నారు.
ప్రస్తుతం జనసేనలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ముందు ముందు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలి, అసలు ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడానికి కారణాలు, పార్టీ లో అంకితభావంతో పనిచేసే నాయకులు ఎవరెవరు ? అనే విషయాల మీద క్షుణ్ణంగా చర్చిస్తున్నారు.ఈ సందర్భంగా కింది స్థాయి నాయకులు ఏ విధంగా నడుచుకోవాలనే విషయం మీద కూడా సలహాలు, సూచనలు, ఇస్తున్నారు.ఇదే సందర్భంలో జనసేన బీజేపీతో కలిసి అడుగులు వేస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద కూడా నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికీ బాగా బలం పుంజుకుని అధికారం చేపట్టే స్థాయిలో ఉండాలంటే అది ఒంటరిగా సాధ్యం కాదని, బీజేపీతో కలిసే వెళ్తే తప్ప పార్టీని బతికించుకోలేమని పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీలోని కీలక నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గత రెండు రోజులుగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న పవన్ బీజేపీతో కలిసి వెళ్లడంపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది.రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలవడం తప్ప మరో మార్గం లేదని జనసేన నేతలు కూడా భావిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో అప్పుడే ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మరికొంతకాలం వేచి చూద్దామనే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది.
కొంతకాలం క్రితం తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్ అక్కడ బీజేపీ అగ్ర నాయకుడు రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా జనసేనను బీజేపీలో విలీనం చేయాల్సిందిగా రామ్ మాధవ్ కోరాడట.
అయితే పార్టీని బీజేపీలో విలీనం చేయడం కంటే ఆ పార్టీతో కలిసి పనిచేయడమే బాగుంటుందని కొందరు నేతలు పవన్కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని పవన్ ఆ తరువాత రామ్ మాధవ్ కూడా తెలియజేసాడట.
ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులు పార్టీలో ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ ద్వారా మరింత బలపడి వచ్చే ఎన్నికలనాటికి అధికారం సులువుగా దక్కించుకోవచ్చనే ప్లాన్ కూడా జనసేన వర్గాలు వేస్తున్నాయట.మొత్తంగా జనసేన బీజేపీ లో విలీనం కాదని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా పైకి చెబుతున్న లోపల మాత్రం బీజేపీతో జత కట్టాలని తహతహలాడుతున్నట్టుగానే కనిపిస్తోంది.