జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా సంచలనం సృస్తిస్తూ అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాడు.పార్టీని మరింత ముందుకు తీసుకుళ్లేందుకు ప్రయత్నాలు అయితే బాగానే చేస్తున్నాడు.
అయితే ఇదే స్పీడ్ గత ఎన్నికల ముందు నుంచి చేసి ఉంటే ప్రయోజనం మెరుగ్గానే ఉండేది.అప్పట్లో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా ఉన్నా ఆ స్థాయిలో పార్టీని పవన్ ముందుకు తీసుకెళ్లలేకపోయాడు అనే అపవాదు ఉంది.
అంతే కాదు పవన్ కల్యాణ్ పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవటంతో పార్టీ నాయకుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది.అంతే కాదు పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 140 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటు దక్కడం ఆ పార్టీని మరింత వెనక్కి నెట్టింది.
ప్రస్తుతం పవన్ యాక్టివ్ గానే ఉన్నాడు.అయినా క్షేత్ర స్థాయిలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే విషయంలో ఇంకా వెనకబడే ఉన్నట్టు కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటే సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి.దాదాపు 16 వేల సర్పంచులు, సుమారు 7 వేల ఎంపిటిసి, జడ్పిటిసిలకు జరగబోయే ఎన్నికలకు పార్టీ తరపున పోటీ చేసే విషయంలో జనసేనలో అయోమయం నెలకొంది.పార్టీ స్టాండ్ ఏమిటో ఇప్పటి వరకు పవన్ నేతలెవరితోను చర్చించలేదు సరికదా క్షేత్ర స్థాయిలో పార్టీ బలహీనంగా ఉన్న విషయాన్ని కూడా పవన్ గుర్తించలేకపోతున్నారనే విమర్శలు పవన్ మూటగట్టుకుంటున్నారు.ఒకవైపు అధికార వైసిపి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసుకుంటుంటే ప్రతిపక్షాల్లో మాత్రం ఆ ఊపు ఎక్కడా కనిపించడమే లేదు.
పవన్ అభిమానుల విషయాన్ని పక్కనపెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు చాలానే ఉంటాయి.గ్రామ స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసి ఓట్లు వేయించే నాయకుల అవసరం ఎంతయినా ఉంటుంది.అంటే ముందుగా పార్టీలోకి పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నాయకులను చేర్చుకుని గ్రామ కమిటీల నిర్మాణం చేపట్టి ఇప్పటి నుంచే తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని జనసేన నాయకులే చెబుతున్నారు.కానీ పవన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించడంలేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాస్త సఖ్యత పాటిస్తుండడంతో వీరి మధ్య అధికారిక లేక అనధికారిక పొత్తు ఏమైనా విచ్చుకుంటుందా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.