ఈ ప్రశ్న సినిమాలకు సంబంధించింది కాదు.టీడీపీకి, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి సంబంధించింది.
అంటే బాబుతో పవన్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆయనతో స్నేహం కొనసాగుతుందా? లేదా దోస్తీ వదులుకుంటాడా? ఆయన వరుసగా సామాజిక మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి.పవన్-చంద్రబాబు స్నేహం కొనసాగాడని, బాబుతో తెగతెంపులు చేసుకోవడానికి పవన్ రెడీగా ఉన్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆంధ్రా రాజదాని కోసం ఇంకా భూములు కావాలని, స్వచ్చందంగా భూములు ఇవ్వకుంటే భూ సేకరణ చట్టం ప్రయోగించి రైతుల నుంచి భూములు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నది.అంటే రైతులు వారంతట వారు భూములు ఇవ్వకుంటే బలవంతంగా తీసుకుంటారన్న మాట.దీన్ని పవన్ వ్యతిరేకిస్తున్నాడు.తన వ్యతిరేకతను సామాజిక మీడియా ద్వారా తెలియచేసాడు కూడా.
తాజాగా మరో వ్యాఖ్య కూడా చేసాడు.ఇందులో ప్రముఖ న్యాయవాది రామ్ జేత్మలాని చెప్పిన మాటలు కోట్ చేసాడు.
దాని సారాంశం ఏమిటంటే….ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికగానే రాజకీయ పార్టీకి విధేయత చూపాలి.
ఒకవేళ ఆ రాజకీయ పార్టీ విధానాలు ప్రజలకు హాని చేసేవిగా ఉంటే అప్పుడు కూడా విధేయతగా ఉంటే అది జాతి పట్ల నేరం చేసినట్లు అవుతుంది…అని పవన్ సామాజిక మీడియాలో పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు చంద్ర బాబును ఉద్దేశించి చేసారని విశ్లేషకులు అంటున్నారు.
భూ సేకరణ ప్రజా వ్యతిరేకం కాబట్టి ఆ పని చేస్తే బాబుతో దోస్తీ కట్ చేస్తారని అనుకుంటున్నారు.భూ సేకరణ చేయాలనుకున్న గ్రామాల్లో పవన్ పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడతారట.
ముందుగా బాబుకు సమాచారం అందించకుండానే ఆ గ్రామాలకు పోతారట.ఆ గ్రామాలకు వెళ్ళడం కోసం అహ్మదాబాద్ లో సినిమా షూటింగ్ కూడా రద్దు చేసుకున్నారట.
ఇదిలా ఉంటే ఆదివారం పవన్ ముఖ్యమంత్రి బాబుతో సమావేశం అవుతారని సమాచారం.బాబు పవర్ స్టార్ను కన్విన్స్ చేస్తారా? ఈ హీరో బాబును భూ సేకరణ మీద నిలదీస్తారా? మరి పవన్ ఏం చేయాలనుకున్నాడో, ఏం చేస్తాడో చూడాలి.