గతం కంటే భిన్నమైన రాజకీయాలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నారు.నిన్న తూర్పుగోదావరి జిల్లా లో శ్రమదానం కార్యక్రమం చేపట్టిన పవన్ ఈ సందర్భంగా చేసిన ప్రసంగం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఎప్పుడూ కులాల అంశాన్ని ప్రస్తావించకుండా, అసలు ఆ అంశాన్ని తలకెత్తుకుంటే పెద్ద తలనొప్పి అన్నట్లుగా భావిస్తూ వచ్చిన పవన్ రాజమండ్రిలో నిర్వహించిన సభలో మాత్రం కులాల అంశంపైనే ఎక్కువ ప్రసంగం చేశారు. కాపు ,బలిజ, తెలగ ఒంటరి సామాజిక వర్గాలు కలిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని, మీరంతా ఒక్కటి అయితేనే తప్ప, రాజ్యాధికారం దక్కదని మాట్లాడారు.
కాపు సామాజిక వర్గం అంతా మాట్లాడుకుని ఒక మాట మీద నిలబడాలి అని, రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని, ఇతర కులాల వారికి అండగా నిలబడాలి అంటూ పవన్ పిలుపు ఇచ్చారు.తనకు రెడ్లు అంటే గౌరవం ఉందని , అన్ని కులాలు ఒక్కటే అంటూ అన్ని కులాల మద్దతు పొందేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లుగా పవన్ ప్రసంగించారు.
ఇక ఏపీలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని , ఇతర కులాల వారికి అండగా నిలబడాలి అంటూ పవన్ పిలుపు ఇచ్చారు.రాష్ట్రంలో సమూల మార్పులకు కాపుల నాంది పలకాలని , ఇదంతా ఉభయగోదావరి జిల్లాలతోనే ముడిపడి ఉందని, ఈ రెండు జిల్లాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాపు సామాజిక వర్గాన్ని పవన్ ఏకం చేసే విధంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
కాపు సామాజిక వర్గం రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని పవన్ చెప్పారు.పవన్ ప్రసంగం మొత్తం కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు గానే కనిపించింది.పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఎక్కడా పవన్ కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేయలేదు.అలా చేస్తే తాను కాపుల కోసమే పార్టీ పెట్టానని, వారికే పెద్దపీట వేస్తున్నాను అనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్లిపోతాయి అనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆ ముద్ర వేయించుకునేందుకు ఇష్టపడలేదు.
అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా తనవైపుకు తిప్పుకుంటే తప్ప, ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉండదు అనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.