గత ప్రభుత్వం హయం లో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కరకట్ట వద్ద ప్రజావేదిక నిర్మాణం జరిగింది.
అయితే ఈ నిర్మాణం అక్రమ కట్టడం అని వైసీపీ పార్టీ ఆరోపిస్తూ ఇప్పుడు అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజావేదిక ను కూల్చి వేయాలని నిర్ణయించింది.దీనితో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం తో టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.
అయితే వైసీపీ నేతలు మాత్రం తమ చర్యను సమర్ధిస్తూ టీడీపీ నేతలపై ఫైర్ అవుతున్నారు.అయితే ఈ ప్రజావేదిక కూల్చివేత పై తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
గుంటూరు జిల్లా నంబూరు లో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవం లో పాల్గొన్న పవన్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 108 కలశాలతో అక్కడ పూజారులు జరిపిన పూజలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజావేదిక కూల్చివేత పై స్పందించారు.అక్రమకట్టడాల కూల్చివేత ఒక్క ఈ ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని వ్యాఖ్యానించారు.
అనుమతిలేని అన్ని భవనాలను కూల్చివేస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి స్థాయి లో నమ్మకం కలుగుతుందని పవన్ అన్నారు.